హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): పేదరికం లేని తెలంగాణను ఆవిష్కరించటమే తన లక్ష్యమని, అందుకోసమే తన్లాడుతున్నాను తప్పితే పదవుల కోసం కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన పేరే తనకు ఆకాశమంత కీర్తి అని.. పదవులు అంతకు మించినవి కావని తేల్చి చెప్పారు. ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో బీఆర్ఎస్ ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘తెలంగాణ తెచ్చిన పేరే నాకు ఆకాశమంత పెద్దది. దాన్ని మించింది ఉన్నదా? అయినా మీరు మ న్నించి ఇచ్చిండ్రు కాబట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన. పదేండ్లాయె.. నా అంత ఎక్కువకాలం పనిచేసిన తెలుగు ముఖ్యమం త్రి ఎవరూ లేరు. ఈ కీర్తి చాలు నాకు. ఇవ్వాళ నేను కొట్లాడేది పదవి కోసం కాదు. వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి. అదీ నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చెయ్యేసుకొని హాయిగా నిద్రపోయేలా బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇం చుకు నీళ్లు రావాలి. దానికోసం తన్లాడుతున్నమే తప్ప పదవి కోసం కాదు’ అని ఉద్విగ్నంగా ప్రకటించారు. పార్టీల వైఖరి, నాయకుల తీరును చూసి ఆలోచించి ఓట్లేయాలే తప్ప, ఆగం కావొద్దని సూచించారు. ఇప్పడు పొరపాటు చేస్తే పదేండ్లు చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణకు శని అని, రైతాంగానికి అశనిపాతమని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే కల్లోలం, రక్తపాతమని నిప్పులు చెరిగారు.
పార్టీల పాలసీని చూడండి..
ఎన్నికలు రాగానే అనేక ప్రలోభాలకు గురిచేస్తారని, ఎవరో ఏదో చెప్పారని కాకుండా విచక్షణతో ఆలోచించి, రాయేదో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. అభ్యర్థుల గుణగణాలతోపాటు, వారి వెనుక ఉన్న పార్టీల విధానాలను, చరిత్రను చూడాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర అంతా ప్రజల ముందే ఉన్నదని, ప్రాణాలకు తెగించి రాష్ర్టాన్ని సాధించడంతోపాటు, పదేండ్లపాటు శ్రమకోర్చి ఒక దరికి తెచ్చామని వివరించారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్, కంటివెలుగు, గురుకులాలు తదితర పథకాలను ఉదహరించారు. రైతులకు నీటి తీరువా రద్దు చేశామని, 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు ఉచితంగా సరఫరా చేస్తున్నామని, పెట్టుబడి కోసం రైతుబంధు, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కు టుంబానికి రైతుబీమా ఇస్తున్నామని, పండిన ధాన్యం మొత్తాన్ని మద్దతులో ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని వివరించారు. పల్లెదవాఖానాలు, బస్తీదవాఖానాలు ఏర్పాటు చేసి వైద్యరంగాన్ని బలోపేతం చేశామని, మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేశామని అవన్నీ ప్రజల కండ్ల ముందే ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యమే ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పింఛన్ రూ.5 వేలు చేస్తామని, , రైతుబంధును రూ. 16 వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు. గల్ఫ్ బాధితులకు కూడా సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ది అవకాశవాదం
ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఇక్కడ ఒకాయన ఉండే పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావు అని. మాతోని మీరు గెలిచిన్రు కానీ మీతోని మేం గెలిచినమా? దమ్ముంటే రుజువు చెయ్ కేసీఆర్ అని సవాల్ విసిరిండు. నేను రాజీనామా చేసి ఆయన మొఖాన కొట్టిన. ఆ రోజు ఎంపీగా మళ్ల పోటీ చేసిన. ఇదే జీవన్రెడ్డి నామీద సమైక్యవాదుల తరపున పోటీ చేసిండు. 2.50 లక్షల మెజార్టీతోని ప్రజలు నన్ను గెలిపించిన్రు. చరిత్ర చూడండి. తెలంగాణను ముంచింది ఆంధ్రవాళ్ల కంటే ఎక్కువ తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే. ఇది ఇండియా మొత్తానికి తెలుసు. అవకాశవాదమే తప్ప ఎన్నడూ తెలంగాణ కోసం కాంగ్రెస్ పోరాడలె. ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నా ఇక్కడి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. అందులో జీవన్రెడ్డి కూడా ఉన్నడు. మరి తెలంగాణ కోసం పేగులు తెగేవరకు కోట్లాడిందెవడు? తెలంగాణ తెచ్చిందెవడు? 24 గంటల కరెంటు తెచ్చినోడు ఎవడు? ప్రతి ఇంట్లా నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చినోడు ఎవడు? జగిత్యాలను జిల్లా చేసినోడు ఎవడు?’ అని ప్రశ్నించారు. ఎవరు నిజమైన సిపాయిలో గుర్తించాలని కోరారు.
సంజయ్తోనే జగిత్యాల అభివృద్ధి
జగిత్యాల సభలో ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘జీవన్రెడ్డితోని ఏమైతది? స్టేట్ పాలసీ అని చెప్పి ఇంట్ల పంటడు. కరెంటు బందయితే తెత్తడా? భూములు ఆగమైతే ఏమైనా చేత్తడా? ఆడ ఎవడో ముఖ్యమంత్రయితే వాడు చేత్తడు. ఈయనేం చేయాలె.. భజన చేయాలె. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ విద్యావంతుడు. ప్రజా సేవలో ఉన్న వ్యక్తి. జగిత్యాలను జిల్లా చేశాం. మెడికల్ కాలేజీ వచ్చింది. పట్టణం అభివృద్ధి చెందుతున్నది. రాబోయే కొద్ది రోజుల్లోనే కరీంనగర్ అంతటి పెద్ద పట్టణం అవుతుంది. అది జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ గప్పాలు కొట్టుడె. దాంట్ల ఇప్పుడు 12 మంది ముఖ్యమంత్రులున్నరు. గెలిచేది లేదు సచ్చేది లేదు. గాలి లేదు గత్తర లేదు. ఉన్నకాడికి గాలి బీఆర్ఎస్దే ఉన్నది. ఇవాళ్టితో నాది 86వ సభ. రేపు ఎల్లుండితో నా ప్రచారం కంప్లీట్ అవుద్ది. మొత్తం తిరిగి చెబుతున్న.. వందశాతం భయంకరమైన మెజార్టీతోని బీఆర్ఎస్సే వస్తుంది’ అని స్పష్టంచేశారు.
జాన్సన్నాయక్ నా కొడుకులాంటోడు
ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 7,500 మందికి 22,470 ఎకరాలు పంపిణీ చేశామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. నిజాం సర్కారు కట్టిన సదర్మాట్ ప్రాజెక్టు నుంచి 15 వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉన్నా ఎన్నడూ సరిగా రాలేదని, అందుకే దానిపైనే ఇప్పుడు సదర్మాట్ బరాజ్ కట్టామని తెలిపారు. పాత 15 వేల ఎకరాల స్థిరీకరణతోపాటు, కొత్తగా మరో 20 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయని, అది తన జిమ్మెదారీ అని భరోసా ఇచ్చారు. డిగ్రీకాలేజీ, రెవెన్యూ డివిజన్ను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ‘బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్నాయక్ నా కొడుకు రామ్ క్లాస్మేట్. నాకు కొడుకులాంటోడు. ఖానాపూర్ను రామారావు దత్తత తీసుకుంట అని చెప్పినట్టు నాకు తెలిసింది. రామారావు దత్తత తీసుకున్నంక మీకేం తక్కువ పడుతది. జాన్సన్నాయక్కు ఓటేస్తే నాకు వేసినట్టే లెక్క. మంచి మెజార్టీతో గెలిపించాలి’ అని కోరారు. జాన్సన్నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయనకు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీయే ఉన్నదని చెప్పారు.
ఏడ్చిండని ఓట్లేస్తే తర్వాత మనం ఏడ్వాలె..
వేములవాడ పట్టణంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. తన జీవితంలో ప్రధాన ఘట్టమైన పెళ్లి ఈ రాజరాజేశ్వర ఆలయంలోనే జరిగిందని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే రమేశ్కు మంచి అనుభవం ఉన్నదని, కోర్టులో కేసు ఉండటంవల్లనే అభ్యర్థిని మార్చి లక్ష్మీనరహింహారావును నిలబెట్టామని వెల్లడించారు. రమేశ్ను గతంకంటే మంచి పదవి ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. రమేశ్ ఎమ్మెల్యేగా వేములవాడ చుట్టూ రింగు రోడ్డు వేయించిండు. రూ.19 కోట్లతో బద్ది పోశమ్మ గుడిని విశాలం చేయించిండు. రాజన్న మన ఇంటి ఇలవేల్పు కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. కలికోట సూరమ్మ చెరువును కూడా వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నాది. వేములవాడ బాగు పడుతున్నది. ఇసుంటి సమయంలో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ మోసపోతం. లక్ష్మీనరసింహారావు మంచి వ్యక్తి. వేములవాడ నియోజకవర్గ ముఖచిత్రం మార్చాలన్న ధ్యేయంతోనే ఎన్నికల బరిలో దిగిన అని చెప్తున్నడు. కాబట్టి మీరు ఆయనను మంచి మెజారిటీతో గెలిపించండి. మీరు కోరిన కోర్కెలన్నీ తీర్చే బాధ్యత నాది. కాంగ్రెసాయన ఏడ్చిండు తూడ్చిండు అని ఓట్లేస్తరా ఎక్కడైనా? ఒకవేళ వాళ్లకు ఓట్లేస్తే.. ఆ తర్వాత మనమే ఏడ్వాల్సి వస్తది’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
నేను కొట్లాడేది పదవికోసం కాదు
‘ఈ రోజు ఈ మాట కూడా చెప్పదలుచుకున్న. క్లియర్గా చెప్తున్న జగిత్యాలలో. చాలామందికి తెలుస్తలేదు. నాకేం గావాలె? తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది! దాన్ని మించింది ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చిండ్రు కాబట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన. పదేండ్లాయె. నా అంత ఎక్కువకాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడేది ఇవ్వాళ నా పదవి కోసం కాదు. కచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి. అదీ నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలె. రైతాంగం గుండెమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రబోయి, బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలె. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలె. దానికోసం తన్లాడుతున్నమే తప్ప పదవి కోసం కాదు. నాకిప్పుడు 70 సంవత్సరాల వయసొచ్చింది. ఇంకేం కావాలి ఈ జీవితానికి? ఇవ్వాళ దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే. పార్టీల వైఖరి, నాయకుల సరళి అన్నీ ఆలోచించి ఓట్లేయాలే తప్ప ఆగమై ఓట్లేయొద్దు’ అని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రభాకర్రెడ్డి గెలిస్తే నెలరోజుల్లో ఆర్డీవో ఆఫీసు
పదేండ్ల నుంచి ఎంపీగా ఉన్న ప్రభాకర్రెడ్డి చీమకి, దోమకి కూడా అన్యాయం చేసే మనిషి కాదని, ప్రజల్లో కలిసిపోయి వారికి మంచి చేశారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. దుబ్బాకలో తాను హైస్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి తనకు బాగా తెలుసని, ఈ ప్రాంతంలో గతంలో ఏనాడూ కత్తిపోట్ల సంస్కృతి లేదని తెలిపారు. ‘కత్తులు పట్టుకోవాలంటే మనకు కత్తులు దొరకవా? అంతకన్నా పొడుగు కత్తులు కూడా తేగలం కదా? కానీ అది పద్ధతి కాదని మేం మర్యాద పాటించాం. ఎంత కోపమొచ్చినా అణచివేసుకున్నాం’ అని చెప్పారు. ప్రభాకర్రెడ్డి ఎంతో యోగ్య త ఉన్న వ్యక్తి అని, ఆయనను గెలిపిస్తే నెలరోజుల్లో దుబ్బాకలో ఆర్డీవో ఆఫీసు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దుబ్బాకలో సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు.
ధరణికి రోగమైందా? నొప్పయిందా?
రైతుల భూముల రక్షణకు తీసుకొచ్చిన ధరణిని తీసి బంగాళాఖాతంలో వేసి భూ మా తను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఏమైంది ధరణికి? రోగమైందా? నొప్పయిందా? పారదర్శకంగా ఉన్నది? నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఎవలి మండల కేంద్రంలో వాళ్లకు పావుగంటల అవుతున్నయ్. మునుపు ఏడాది, రెండేండ్లు అవుతుండె. ఇప్పుడు మళ్లా రైతుల నోట్ల మన్నువోత్తం.. దళారులే మా చుట్టాలు.. పైరవీకారులు, లంచగొండి అధికారులే మా చు ట్టాలు అని కాంగ్రెస్ బాజాప్తా చెప్తున్నది. ధరణి తీసి మళ్లా భూమాత పెడతామంటున్నారు. అది భూమాత కాదు. భూ మేత’ అని సీఎం కేసీఆర్ ఎద్దేశా చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో అంతా కల్లోలమే..
కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ చూసినా కల్లోలమే కనిపిస్తుందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నరు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని. ఇందిరమ్మ రాజ్యంలో ఏమొచ్చింది జగిత్యాలకు? సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల కల్లోలిత ప్రాంతాలుగా మారాయి. యువకులను పిట్టల్లాగా కాల్చిచంపిన్రు కదా? పొద్దున లేస్తే నెత్తురు పారుడే కదా ఇందిరమ్మ రాజ్యమంతా? ఇందిరమ్మ రాజ్యంలో ఎవడు ఉద్ధరించబడ్డడు? దళితులు బాగుపడ్డరా? గిరిజనులు బాగుపడ్డరా? రైతులు బాగుపడ్డరా? ఎవరినైనా పట్టించుకున్నరా?’ అని మండిపడ్డారు.
నాకేం గావాలె? తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది! దాన్ని మించింది ఉన్నదా? రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన. పదేండ్లాయె. నా అంత ఎక్కువకాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడేది ఇవ్వాళ నా పదవి కోసం కాదు. కచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి. అదీ నా పంతం. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలె. దానికోసం తన్లాడుతున్నమే తప్ప పదవి కోసం కాదు.
– సీఎం కేసీఆర్
కత్తులు పట్టుకోవాలంటే మనకు కత్తులు దొరకవా? అంతకన్నా పొడుగు కత్తులు కూడా తేగలం కదా? కానీ అది పద్ధతి కాదని మేం మర్యాద పాటించాం. ఎంత కోపమొచ్చినా అణచివేసుకున్నాం.
– సీఎం కేసీఆర్