ధర్మం పేరుతో, మతం పేరుతో దేశాన్ని ముక్కలు చేయటమే విధానంగా మారింది. అద్భుత దేశాన్ని ఆగం చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోయటమే పనిగా పెట్టుకొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ మాట వినని వారిపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలను ప్రయోగించి ఆగం చేస్తున్నారు. ఇదెంత కాలం కొనసాగాలి?
– సీఎం కేసీఆర్
గుజరాత్ మాడల్ అనేది వందశాతం అట్టర్ ప్లాప్ అయింది. గాంధీ పుట్టిన గడ్డపై మద్యనిషేధం విధించామంటారు. కానీ 17 మంది కల్తీ సారా తాగి చనిపోయారు. పైగా అది ప్రధాని సొంతరాష్ట్రం. మానవాభివృద్ధి సూచీ చూడండి.. దేశం ఎక్కడున్నది? అందులో గుజరాత్ అట్టడుగున ఉన్నది. కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తారు. పేదల బాగోగులు పట్టించుకోరు. దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలియదా? దళితుడు పెండ్లి చేసుకొని గుర్రం మీద వెళ్లడం కూడా తప్పేనా? ఇదేనా గుజరాత్ మాడల్? – సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశం నుంచి బీజేపీని సాగనంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్తోనే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసమర్థ విధానాలను అవలంబిస్తున్న మోదీ సర్కారు గద్దె దిగిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. పుష్కలమైన జలసిరులున్నా దేశంలో జలయుద్ధాలు కొనసాగుతున్నాయంటే అందుకు బీజేపీ విధానాలే కారణమని దుయ్యబట్టారు. బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. గల్వాన్ లోయలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు, సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బీహార్ సీఎం నితీశ్కుమార్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అంశాలవారీగా సీఎం మీడియాతో చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
బీజేపీని దేశం నుంచి సాగనంపాల్సిందే
సీఎం నితీశ్కుమార్తో విస్తృతంగా అనేక విషయాలపై చర్చించాం. పలు విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాం. ఏ రకంగా చూసినా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని నరేంద్రమోదీ సర్కార్ను దేశం నుంచి సాగనంపాల్సిందేనని నిర్ణయించాం. 8 ఏండ్లుగా మోదీ ఏ ఒక్క రంగానికీ మేలు చేయలేదు. మోదీ అనుసరిస్తున్న విధానాలతో దేశం నాశనమవుతున్నది. ప్రతి పౌరుడూ ఆందోళన చెందే స్థితి నెలకొన్నది. నీళ్లు, కరెంటు.. రైతులు, దళితులు, మహిళలు.. కఠిన దరిద్రాన్ని అనుభవిస్తున్న వర్గాలు.. ఇందులో ఏ ఒక్క వర్గానికి మేలు జరిగినా దేశం ఇవాళ ఇట్లా ఉండేది కాదు. మోదీ కంటే ముందు 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. ఏ ఒక్కరి కాలంలోనూ ఇంత అసమర్థ విధానాలు అమలు కాలేదు.
రూపాయి విలువ ఇంతలా పతనం కాలేదు. మోదీ అనాలోచిత విధానాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై దేశం గాడి తప్పింది. పెట్రో ధరలతో సహా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశానికి మూల పెట్టుబడిగా ఉండే మేధాసంపత్తి దేశం నుంచి పారిపోతున్నది. కొత్త పెట్టుబడులు రాకపోగా.. ఉన్నవి వెనక్కి పోతున్నాయి. దేశాన్ని అద్భుతంగా పాలించే వ్యవస్థే ఉంటే 13 నెలల పాటు రైతులు ఎందుకు రోడ్లెక్కుతరు? దేశంలో సిరిసంపదలకు కొదవలేదు. ప్రకృతి వనరులకు కొరత లేదు. నదుల్లో 70 వేల టీఎంసీలు ఉన్నా జలయుద్ధాలు ఎందుకు కొనసాగుతున్నాయి? 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులో ఉన్నా, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు కరెంటు కోతలతో సతమతమవుతున్నాయి. ప్రజలు తాగేనీటికి ఒక విధానం ఉండొద్దా? 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా ఇంత దుర్మార్గ పరిస్థితా? ప్రతి పట్టణంలో చివరకు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రతి రోజూ తాగునీటిని కొనుక్కొనే పరిస్థితి దాపురించింది.
దేశం తలదించుకొంటున్నది
మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దుర్మార్గమైన రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర చేస్తున్నది. ఇలా చేస్తుంటే పోటీ ప్రపంచంలో దేశ ప్రతిష్ఠ ఏం కావాలి? దేశంలో జరుగుతున్న పరిణామాలతో విదేశాల్లో ఉన్న మన దేశ రాయబారులను పిలిచి మందలించే దాకా వెళ్లింది. ఇటువంటి చర్యలతో దేశం తలదించుకోవాల్సి రావడంలేదా? ధర్మం పేరుతో, మతం పేరుతో దేశాన్ని ముక్కలు చేయటమే విధానంగా మారింది. అద్భుత దేశాన్ని ఆగం చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోయటమే పనిగా పెట్టుకొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ మాట వినని వారిపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలను ప్రయోగించి ఆగం చేస్తున్నారు. ఇదెంత కాలం కొనసాగాలి? మేకిన్ ఇండియా నినాదం ఏమైంది? పిల్లలు ఎగిరేసే పతంగులకు కావాల్సిన మాంజా కూడా చైనా నుంచి రావాల్నా? నెయిల్ కట్టర్.. షేవింగ్ బ్లేడ్.. ఆఖరికి జాతీయ పతాకం కూడా చైనా నుంచి తెప్పించుకొనే దురవస్థ దాపురించాల్నా? మన ఖాదీ ఏమైంది? మేకిన్ ఇండియా అంటే ఇదేనా? 1980 వరకు చైనా జీడీపీ మన కన్నా చాలా తక్కువ. ఇప్పుడు 16 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదిగింది.
మనం మాత్రం 3 ట్రిలియన్ డాలర్లకు అటూ ఇటూగా నెట్టుకొస్తున్నాం. ఇది సిగ్గుపడాల్సిన విషయం. మొదట్లో చైనా మనకన్నా అన్ని రంగాల్లో తక్కువగా ఉండేది. ఇవాళ అమెరికాను శాసించే స్థాయికి వెళ్లింది. ఇటువంటి అనేక అంశాలపై సీఎం నితీశ్కుమార్తో సమగ్రంగా చర్చించాం. దేశంలోని అన్ని విపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకురావాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ముక్తకంఠంతో బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఎత్తుకొన్నాం. దేశం పురోగమించాలన్నా.. భారత్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పెరగాలన్నా.. బీజేపీ ముక్త్ భారత్ అయితేనే సాధ్యం. 75 ఏండ్ల స్వతంత్ర భారతం అనుసరించిన పద్ధతికి భిన్నంగా వ్యవహరిస్తే తప్ప దశ మారదు. ప్రబలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు అద్భుత అవకాశాలున్నాయి. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన గడ్డ నుంచి దేశ ప్రజలు, యువత ఆలోచించాలని కోరుతున్నాం. దేశం ప్రగతిపథంలో పయనించాలా? తప్పుడు చర్యలతో మరింత అధోగతి పాలు కావాలా? ఆలోచించాలి. ఈ విషయంలో యువకులు, నిపుణులు, ఆర్థిక, సామాజికవేత్తలు ముందుకు రావాలి. నిర్మించటం కష్టం. కూల్చడం చాలా సులువు. ఒక్కసారి కూలిపోతే.. మరలా నిర్మించుకోవటానికి ఎంతో సమయం పడుతుంది.
ఎన్నికల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది బీజేపీయే
తమకు భయపడే పార్టీల నేతలను భయపెట్టి లొంగదీసుకోవడం, విననివాళ్లను బెదిరించడం బీజేపీకి పరిపాటి అయింది. తామేదో సత్య హరిశ్చంద్రుని తమ్ముళ్లు అన్నట్టు పోజులు కొడతారు. ఎన్నికల్లో అత్యధికంగా డబ్బులు ఖర్చుపెట్టే పార్టీ బీజేపీ అని అందరికీ తెలుసు. ఆ పార్టీలోనే అత్యంత అవినీతిపరులున్నారనే విషయమూ యావత్ ప్రపంచానికి తెలుసు. మోదీ ఘనకార్యంతో శ్రీలంకలో దేశం పరువు పోయింది. తన మిత్రుడికి మోదీ కాంట్రాక్టు ఇప్పించారని శ్రీలంక పార్లమెంట్ కమిటీయే చెప్పింది. మోదీ చర్యను నిరసిస్తూ శ్రీలంకలో ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. మోదీ అమెరికా వెళ్లినప్పుడు ‘మళ్లీ వచ్చేది ట్రంప్ సర్కారే’ అని ప్రచారం చేస్తారా? ఒక దేశ ప్రధాని మరో దేశ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చా? ఇదా దేశ దౌత్యనీతి? అవేమైనా అహ్మదాబాద్ ఎన్నికలా? దేశం గురించి ఆలోచించేవాళ్లు ఎవరైనా ఇలా చేస్తారా? ఈ పరిణామాలపై జర్నలిస్టులు స్పందించాలి. ప్రజలను చైతన్యం చేయాలి. ఎమర్జెన్సీ సమయంలో పత్రికలు, జర్నలిస్టులు ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణకు కృషి చేశారో తిరిగి అదే గురుతర బాధ్యతను నెరవేర్చాలి.
గుజరాత్ మాడల్ అట్టర్ప్లాప్
గుజరాత్ మాడల్ అనేది వందశాతం అట్టర్ ఫ్లాప్ అయింది. గాంధీ పుట్టిన గడ్డపై మద్యనిషేధం విధించామంటారు. కానీ 17 మంది కల్తీ సారా తాగి చనిపోయారు. పైగా అది ప్రధాని సొంతరాష్ట్రం. మానవాభివృద్ధి సూచీ చూడండి.. దేశం ఎక్కడున్నది? అందులో గుజరాత్ అట్టడుగున ఉన్నది. కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తారు. పేదల బాగోగులు పట్టించుకోరు. దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలియదా? దళితుడు పెండ్లి చేసుకొని గుర్రం మీద వెళ్లడం కూడా తప్పేనా? ఇదేనా గుజరాత్ మాడల్? బీజేపీ ముక్త్ భారత్కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది విసృ్తత చర్చల అనంతరం తీసుకొనే నిర్ణయం. ఈ విషయంలో మాకు ఎలాంటి తొందర లేదు. దురదృష్టకరం ఏమిటంటే దేశంలో కొన్ని రాష్ర్టాలు జబ్బు పడ్డాయని అనుకొంటారు. కానీ ఆలా ఆలోచించేవాళ్ల మెదళ్లే జబ్బు పడ్డాయి. దేశం, రాష్ట్రం ఐక్యతా భావంతో ఉంటే ఏ రాష్ట్రం కూడా వెనుకబడదు. అన్ని రాష్ర్టాలను సమభావనతో పురోగతి పథాన తీసుకెళ్లడానికి కృషి జరగాలి. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో నితీశ్కుమార్ పార్లమెంట్ లోపలా, బయటా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇవ్వడం లేదు? నీతి అయోగ్లోనూ బీహార్ గురించి నితీశ్జీ కోరారు. అయినా ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో ప్రధాని చెప్పాలి కదా?
వెలుగు జిలుగుల తెలంగాణ
తెలంగాణ యువ రాష్ట్రం. 2014లో రాష్ట్రం ఏర్పడకముందు అత్యంత తీవ్ర విద్యుత్తు సమస్యను చవి చూసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేడేండ్ల శ్రమ అనంతరం ఇప్పుడు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ఇది నేను చెప్పేది కాదు. పార్లమెంట్లో కేంద్రమే చెప్పింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో 30 వేల మెగావాట్ల విద్యుదుత్పాదక కేంద్రాలు స్విచ్ వేస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ప్రారంభం కాకుండా ఆపుతున్నదెవరు? ఎన్సీఎల్టీ, పీఎల్సీఎల్టీలను సాకు చూపుతున్నదెవరు? కేంద్రం తప్పుడు నిర్ణయాలతో విద్యుదుత్పత్తి కేంద్రాలు చిక్కుకుపోయాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. పెట్టుబడి రెట్టింపు అయింది. సాగు చట్టాలను రద్దుచేస్తూ ప్రధాని స్వయంగా రైతులను క్షమాపణ కోరారు. 2022 వరకు అందరికీ ఇండ్లు కట్టిస్తామన్న మోదీ వాగ్దానం ఏమైంది? ‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదం ఏమైంది? దేశంలో లైంగిక దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మోదీ ఎవరికి రక్షణ ఇచ్చారు?
రూ.3800 బొగ్గును కాదని రూ.25 వేల బొగ్గు కొనాలా?
మా దగ్గర సింగరేణి ఉన్నది. అక్కడ బొగ్గు మాకు టన్నుకు రూ.3,800 పడుతుంది. కానీ కేంద్రం ఆదే బొగ్గును టన్నుకు రూ.25 వేల ఖరీదుతో కొనాలని మాపై ఒత్తిడి చేస్తున్నది. కొనకపోతే విద్యుత్తు సరఫరా నిలిపేస్తామని బెదిరిస్తున్నది. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉన్నది. మాకు నాలుగు వేల లోపే బొగ్గు దొరుకుతున్నప్పుడు మేము 25 వేలు పెట్టి ఎందుకు కొనాలి? కేంద్రం రాష్ర్టాలపై ఇలా ఒత్తిడి చేయడం వెనుక మతలబు ఏమిటి? విద్యుత్తు చార్జీలను పెంచడం ద్వారా వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. అందుకే రైతులు, మేధావులు అప్రమత్తం కావాలంటున్నాం. బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుతున్నాం. రెండు, మూడు రోజుల కిందట 26 రాష్ర్టాల రైతు సంఘాల నేతలు మా దగ్గరకు వచ్చి చూశారు. మా రాష్ట్రంలో ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నాం. రైతు ఏ కారణం చేత చనిపోయినా రైతుబీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం. ఈ పని తెలంగాణ చేయగలినప్పుడు కేంద్రం ఎందుకు చేయదు?
భావి తరాలకు ఏం చెప్తాం?
ప్రపంచంలో భారత ప్రజాస్వామ్యానికి ప్రత్యేకత ఉన్నది. భారత్ అంటే ప్రపంచ దేశాల్లో గౌరవం ఉన్నది. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడే నిర్లజ్జగా ‘దేశంలో ఏ పార్టీనీ ఉండనీయం’ అని చెప్తున్నారు. జాతీయ జెండాను కాదని కాషాయ జెండాను ఎగురవేస్తామని బాహాటంగా చెప్తున్నారు. జాతీయ పతాకాన్ని కించపరుస్తున్నరు. ఇలాంటి వ్యక్తులను, శక్తులను కేంద్రం ఎందుకు ఉపేక్షిస్తున్నది? జాతిపిత మహాత్మాగాంధీని దేశమంతా నెత్తినెత్తుకొని గౌరవిస్తున్నది. అటువంటి జాతిపితను అవమానిస్తారా? భవిష్యత్తు తరాలకు మనం ఏం చెప్తున్నాం? దేశమంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కోట్ల ప్రజల ఆదరణ పొంది.. అద్భుతంగా లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? రేవులు, విమానాశ్రయాలు.. రైల్వేలు.. ఇంకేం మిగిలి ఉంచుతారు? అన్ని నినాదాలు పక్కన పెట్టి.. ‘దేశాన్ని అమ్మేద్దాం’ అనే నినాదాన్ని తీసుకోండి సరిపోద్ది.
అగ్నిపథ్తో దేశ రక్షణ అపహాస్యం
రక్షణ వ్యవస్థలోనూ కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దేశం ఎందరో ప్రధానులను చూసింది. కొందరు ప్రధానుల హయాంలో యుద్ధాలూ జరిగాయి. అయినా పటిష్ఠమైన రక్షణ వ్యవస్థతో దేశం సగర్వంగా నిలబడింది. దేశ రక్షణలో క్రియాశీలకంగా ఉండాల్సిన కేంద్రం.. అపహాస్య విధానాలు అమలుచేస్తున్నది. కీలకమైన సైన్య నియామక విధాన నిర్ణయం తీసుకొనే ముందు ఎవరినీ సంప్రదించకుండా, విపక్షాలతో కనీసం చర్చించకుండా అగ్నిపథ్ను తెచ్చింది. తద్వారా దేశ రక్షణ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్నట్టు మోదీ వ్యవహరిస్తున్నారు. పురోగమిస్తున్న రాష్ర్టాలపై కేంద్రం కత్తిగట్టింది. విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల మెడమీద కత్తిపెట్టి మోదీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం పేరుతో రాష్ర్టాల హక్కులను, రాజ్యాంగ విలువను కాలరాస్తున్నారు. ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పే ధైర్యం కేంద్రానికి లేదు. ఈ దుర్మార్గ నీతిని ఎవరు ప్రశ్నించాలి? వికాసం వైపు అడుగులేస్తున్న రాష్ర్టాలను కూల్చడమే నినాదంగా కేంద్రం ముందుకు సాగుతున్నది.