CM KCR | వైరా : ఇందిరమ్మ రాజ్యంలో అంతా అరాచకలే.. పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు.. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మదన్లాల్కు మద్దతుగా ప్రసంగించారు.
కాంగ్రెస్కు అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన పరిసాలన. ఏం ఉద్ధరించారు అని, ఆనాడు ఎవ్వళ్లు బాగుపడ్డారని, అంతా అరాచకాలు, పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు. ఎస్టీలు, ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఏం చేయలేదు. చేస్తే దళిత, గిరిజనుల పరిస్థితి ఇట్ల ఉండేది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన నాడే వారు ఆలోచించి ఉంటే ఈపాటికి దళిత, గిరిజన వర్గాలు బాగుపడాలి. కానీ జరగలేదు. ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది. ప్రతిపక్షాలను పట్టుకుపోయి జైల్లో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చారు. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు అవసరమే లేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సమీక్షలు జరిపి ఒక దారి పట్టాం. పేదల సంక్షేమం చేశాం అని కేసీఆర్ తెలిపారు.
గోదావరి దగ్గర ఉన్నప్పటికీ మంచినీళ్లు ఇవ్వడం చేతకాలేదు కాంగ్రెస్ పార్టీకి. అసెంబ్లీలో నేను చెప్పాను.. ఐదేండ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో మేం నిలబడం, ఓట్లు అడగం అని చెప్పినం. ఛాలెంజ్ చేసి, వెంబడిపడి, పట్టువట్టి దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగించినం. మీ కండ్ల ముందర ఉన్నాయి. ఇవాళ మంచినీటి బాధలు తీరాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.
మదన్లాల్ కొన్ని కోరికలు కోరారు. అవన్నీ కూడా చేయదగినటువంటి పనులే. ఢిల్లీ నుంచి వచ్చేటివి కావు. మన చేతిలో ఉండేటేవి. వైరా నియోజకవర్గం ప్రజల పక్షాన ఆయన కోరిన పనులు నేను చేయిస్తా. ఆయన సౌమ్యుడు, మంచివాడు. రాములు నాయక్ చాలా గొప్ప మనిషి. నేను రెక్వెస్ట్ చేసి ఈసారి మదన్లాల్కు అవకాశం ఇవ్వమంటే ఆయన కూడా పెద్ద మనసుతో సహకరించి, ఏ మాత్రం విబేధించకుండా రాములు నాయక్ సహృదయంతో పని చేస్తున్నారు. రాములు నాయక్ సముచితమైన గౌరవంలో ఉంటారు. బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకురావాలి అని కేసీఆర్ కోరారు.