CM KCR | ఎల్లారెడ్డి : ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్.. ఆ పార్టీ అనాలోచిత నిర్ణయం వల్లే 58 ఏండ్లు గోస పడ్డామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఉద్యమ సమయంలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. ఉద్యమంలో మనతో కలిసి రాలేదు. అసెంబ్లీలో రూపాయి కూడా ఇవ్వను అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే రోషంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కడు కూడా రాజీనామా చేయలేదు. వారు నోరు మూసుకున్నారు కాబట్టే 58 ఏండ్లు తెలంగాణ నాశనం కావాల్సి వచ్చింది. మళ్లీ ఇవాళ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఆషామాషీగా ఓటు వేయొద్దు అని కేసీఆర్ అన్నారు.
ధరణి, రైతుబంధు ఎత్తేస్తాం.. 24 గంటల కరెంట్కు బదులు 3 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ మూడు ఎత్తేస్తే రైతాంగం తీవ్రంగా నష్టపోతారు. ఈ మూడింటింతో రైతుల ముఖం తెల్లవడుతుంది. గ్రామాలకు వాపస్ వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా గ్రామాలకు వస్తున్నారు. అంతకు ముందు 20 ఎకరాలు భూమి ఉన్నోడికి పిల్లను ఇవ్వలేదు. చప్రాసీ నౌకరి ఉన్నోడికి పిల్లను ఇచ్చారు. ఇవాళ అడుగుతున్నారు.. భూమి ఉంటే పిల్లను ఇస్తున్నారు. ఇప్పుడు అలా భూమి విలువ పెరిగింది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ బోర్డర్లో కూడా ఎకరా భూమి ధర 25 లక్షలు ఉంది. ఐదు ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు అయిపోతుండు. ఎల్లారెడ్డిలో మూడు ఎకరాలు ఉంటే కోటీశ్వరుడు అయితుండు అని సురేందర్ చెబుతున్నాడు. వ్యవసాయ స్థీరికరణ జరిగి రైతులు కుదుటపడ్డారు. ఒక ఐదు, పదేండ్లు ఇవన్నీ అమలవుతే బాధ లేకుండా పోతది. మొండిపట్టుగా ఇవన్నీ చేశాను. రైతుల బాధలు నాకు తెలుసు అని కేసీఆర్ అన్నారు.
24 గంటల కరెంట్ బంద్ చేస్తాం.. 3 గంటల కరెంట్ ఇస్తాం. కాబట్టి 10 హెచ్పీ మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్పీ మోటార్ ఉంటదా..? 3 హెచ్పీ, లేదంటే 5 హెచ్పీ పెట్టుకుంటాం. నీళ్లు బాగా ఉంటే 5 హెచ్పీ పెట్టుకుంటాం. ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి తెలంగాణలో. 30 లక్షల 10 హెచ్పీ మోటార్లు కొనాలంటే ఎవడు కొనివ్వాలి. అందుకు రూ. 30 వేల కోట్లు కావాలి. అంత డబ్బు ఎవడు ఇవ్వాలి నాకు అర్థం కాదు అని కేసీఆర్ మండిపడ్డారు.
ధరణి, రైతుబంధును బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఎవర్ని బంగాళాఖాతంలో వేయాలో ప్రజలు నిర్ణయించాలి. తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉండాలంటే పార్టీల నడవడిక, చరిత్ర గురించి ఆలోచించి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతాంగం నష్టపోతారు. కాబట్టి రైతులు నిర్ణయం తీసుకోవాలి. అనాలోచితంగా ఓటు వేయొద్దు. ఈ విషయాలపై చర్చ చేయండి. ఎల్లారెడ్డి, కామారెడ్డికి రెండేండ్లలో బ్రహ్మాండంగా ఒక ఎకరం కూడా మిగలకుండా పారించే బాధ్యత నాది అని కేసీఆర్ స్పష్టం చేశారు.