CM KCR | బోధన్ : తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి వెళ్లే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వ్యవసాయ స్థీరికరణ చేయాలని బీఆర్ఎస్ ఐదారు పనులు చేసింది. నీటి తిరువా రద్దు చేశాం. నీళ్లకు ట్యాక్స్ లేదు ఇప్పుడు. 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం. రైతుబంధు పథకం పెట్టుబడి సాయం చేస్తున్నాం. రైతు చనిపోతే వారంలోపే రూ. 5 లక్షలు వచ్చేలా బీమా సదుపాయం కల్పించాం. మీ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.. మీ ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నాం. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో ఉన్నాయా..? బిలోలి, ధర్మాబాద్ మీ పక్కకే ఉన్నాయి కాదా..? మహారాష్ట్రకు వచ్చి పార్టీ అన్న పెట్టు.. లేదంటే మా ధర్మాబాద్ తాలుకా తెలంగాణలో కలపుమని అక్కడి నాయకులు అడుగుతున్నారు. మనం ఎంతో కొంత మంచిగా ఉన్నాం కాబట్టే వాళ్లు కలుస్తామని అంటున్నారు. బాగా లేకపోతే ఎందుకు వస్తారు. కర్ణాటకలో లేవు.. ఈ పథకాలు ఇండియాలో కూడా ఎక్కడా లేవు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో రైతులు అంజుమాన్ అప్పులు కట్టకపోతే తలుపులు ఊడపీక్కపోయారు.. కానీ రైతుబంధు గురించి ఆలోచించలేదు అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. రైతుబంధు, రైతుబీమా డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో పడుతున్నాయి. మరి ధరణి తీసేస్తే.. ఈ డబ్బులు ఎలా వస్తాయనేది ఆలోచించాలి. ధరణి ఎత్తేస్తే మళ్లీ దళారుల రాజ్యం, లంచాల రాజ్యం వస్తది. ధరణి తీసేస్తే రైతాంగానికి పెద్ద దెబ్బ.. ప్రమాదం. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లా అదే బ్రోకర్ల రాజ్యం.. ఊరికి నలుగురు పైరవీకారులు, మండలంలో నలుగురు పైరవీకారులు వస్తరు. పాత రిజిస్టరేషన్ సిస్టం వస్తది. షకీల్ గెలిస్తే ధరణి ఉంటది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి రైతులు అరేబియా సముద్రానికి అంతే కదా.. ఈ ఒక్క మాట చాలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి తెలంగాణ రైతులు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. కేసీఆర్ చెప్పిన మాటలను నలుగురు రైతులను పోగేసి చర్చ పెట్టండి. అప్పుడు నిజనిజాలు తేల్చండి. గుడ్డిగా ఓట్లు వేయొద్దు అని కేసీఆర్ సూచించారు.
కరెంట్ 24 గంటలు ఉండాలంటే షకీల్ బాయ్ గెలవాలి.. సుదర్శన్ రెడ్డి గెలిస్తే 3 గంటల కరెంట్ వస్తది. కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కాట కలుస్తది. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం.. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. కేసీఆర్ ఎన్నేండ్లు కొట్లాడాలి. 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. ఇక జిందగీలా నేనే కొట్లాడాలా..? ఇప్పుడు మీరు కొట్లాడాలి. రైతులు అందరూ ఆలోచించి దుర్మార్గపు కాంగ్రెస్ను మట్టి కరిపించాలి. 50 ఏండ్లు మనల్ని ఏడిపించిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించుకుని మన వేలితో మనం పొడుచుకుందామా.? బీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలా అనేది ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.