CM KCR | మందమర్రి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంట్ తీసేస్తే.. రైతులు ఆగమైతపోతారని, రైతులు ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ధరణి పోర్టల్ ఎవరి కోసం తెచ్చామో ఆలోచించాలి. గతంలో రైతుల భూములను ఇష్టమొచ్చినట్లు రాశారు. కోర్టుల చుట్టూ తిప్పారు. పైసలు మింగి నాశనం చేశారు. వారి భూముల మీద హక్కులు వారికే ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చాం. రైతుబంధు డ్బబులు వేయగానే మీ సెల్ఫోన్ టింగ్ టింగ్మని మోగుతుంది. అప్పులు తీరిపోతున్నాయి. పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గొడ్డలి భుజం మీద పెట్టుకుని బయల్దేరింది జాగ్రత్తా.. ఇంతుకు ముందు రైతు భర్తలు వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ రెవెన్యూ సెక్రటరీ సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి.. వీరిలో ఏ ఒక్కరికి కోపం వచ్చిన రైతు భూమి ఖతం అయ్యేది. ఇవన్నీ ఆలోచించి రైతుకే అధికారం ఇచ్చాం. మీ బొటనవేలి మీ భూమిని మారుస్తుంది. రైతు భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. గవర్నమెంట్ తన వద్ద ఉన్న అధికారాన్ని రైతులకు ధారపోసింది. ఈ అధికారాన్ని రైతులు ఉంచుకుంటారా.. పొగొట్టుకుంటారా..? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో వేస్తారట. మరి ఏమైతది.. అందుకే ఆలోచించి ఓటేయాలి. ధరణి తీసేస్తే.. మళ్లా దళారుల రాజ్యమే వస్తది. ఇవాళ దళారీ, దరఖాస్తు లేదు. ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. మరి దీన్ని ఉంచుకుందామా.. ఊడగొట్టుకుందామా..? ఆలోచించాలి అని కేసీఆర్ రైతులకు సూచించారు.
కాంగ్రెస్ నాయకులు 24 కరెంట్ వద్దు అంటున్నారు. రైతుబంధు వద్దు అంటున్నారు. ఆలోచించకుండా ఆగమాగమై ఓటేస్తే ఈ ఐదేండ్లు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. రైతులను ఏనాడూ పట్టించుకోలేదు కాంగ్రెస్. కరెంట్ సక్కగా ఇవ్వలేదు. పాములు కుట్టి అనేక మంది చనిపోయారు. ఇండియా మొత్తంలో 24 గంటలక రెంట్ ఇస్తున్న గవర్నమెంట్ మనమే. మోదీ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. ఎందుకు ఇస్తున్నాం. కేసీఆర్ మొండి కాబట్టి.. అనుకున్నది సాధిస్తాడు కాబట్టి.. రైతులకు కచ్చితంగా బాగుపడాలి అని పది రూపాయిలు పోయినా సరే అని చెప్పి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ దొంగలు వచ్చి తీసేస్తాం అంటున్నారు. ఓట్లు కాదు డిపాజిట్లు కూడా రావొద్దు కాంగ్రెసోళ్లకు. రైతులు ఆలోచించి, ఓటేయకపోతే కేసీఆర్ కూడా ఏం చేయలేడు అని కేసీఆర్ అన్నారు.