CM KCR | గజ్వేల్ : ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి..? మనం ఏంటనేది 30వ తేదీన నిరూపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు నరేంద్ర మోదీ. ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. మనం ఏమన్న పిచ్చి పోసిగాళ్లమా..? తెలివి తక్కువ వాళ్లమా..? ఇటువంటి పార్టీలను మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి. వాళ్లు ఏమంటారు.. మేం ఏం ఇవ్వకున్న మాకే గుద్దిండ్రు.. వీళ్లు గొర్రెలు అనుకుంటరు. మరి మనం గొర్రెలామా..? మనం ఎవరమనేది 30వ తారీఖున నిరూపించాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మన రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్నాం. 58 ఏండ్లు గొడగొడ ఏడ్సినం. మంచినీళ్లకు బాధపడ్డాం. బోర్లు వేస్తే 600 ఫీట్లకు పోయినం.. ఆ బాధలు మర్చిపోయామా..? ఇవాళ ఎండకాలంలో కూడా వాగులు మత్తళ్లు దుంకుతున్నాయి. ఇంత కష్టపడి వచ్చిన రాష్ట్రం, పదేండ్ల వయసున్న రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఒక్కటి కూడా సహాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి, కుట్రలు చేసే కేంద్రానికి మనం ఎందుకు సహకరించాలి..? దయచేసి ప్రతి యువకుడు ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
ఏదో ఒక పేరు మీద గుడ్డిగా ఓట్లు వేయడం కాదు. విచక్షణతోనే ఓటేస్తే లాభం జరుగుతది. మనం కులం మతం జాతి లేకుండా అందరం కలిసిపోతున్నాం.. కాబట్టి ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది. భవిష్యత్లో ఇంకా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. గజ్వేల్ నా నియోజకవర్గం కాబట్టి మీరు ఏది కోరితే అది వస్తది. ఆటోమేటిక్గా జరుగుతనే ఉంటది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
అన్నింటి కంటే నేను చాలా గర్వపడ్డాను. మొన్న రాత్రి సంగారెడ్డి నుంచి ప్రచారం చేసి వస్తుంటే గజ్వేల్ రింగ్ రోడ్డు మీద నుంచే పోయాను. ఇతర పట్టణాల వారు అసూయపడే విధంగా రింగ్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. గజ్వేల్ హైదరాబాద్కు శాటిలైట్ టౌన్ కాబట్టి అనేక పరిశ్రమలు వస్తాయి. అట్లనే రాబోయే రోజుల్లో మన అభివృద్ధి చూసి హౌజ్ బిల్డింగ్ ఇండస్ట్రీ, విల్లాలు కట్టే వారు గజ్వేల్కు క్యూ కడుతారు. ఒకసారి ట్రిపుల్ ఆర్ వచ్చిదంటే గజ్వేల్ దశనే మారిపోతది. గజ్వేల్ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యమంత్రి కావడానికి ఒక భూమిక ఏర్పాటు చేసి, మొదటి ఎన్నికల్లో నన్ను ఇక్కడ్నుంచి ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్లీ అవకాశం ఇచ్చి పంపిస్తే ఈ కీర్తిని ఇంకింత ఇనుమడింపజేసే విధంగా, మన గజ్వేల్ అభివృద్ధిని ఆకాశానికి తీసుకుపోయే విధంగా పని చేస్తానని మనవి చేస్తున్నా అని తెలుపుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.