మహబూబ్నగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, తాగునీరు, ఓడీఎఫ్ తదితర రంగాల్లో తెలంగాణ.. పెద్దపెద్ద రాష్ర్టాలను కూడా దాటేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. మరో 5-10 ఏండ్లు కష్టపడి పనిచేస్తే తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అందుకోలేరని అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రూ.52 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఐడీవోసీ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నేడు అనేక రంగాల్లో నంబర్ వన్గా ఉన్నదని చెప్పారు. ప్రజల ఆరోగ్యంతోపాటు, ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మానవీయ కోణంలో అనేక కొత్త కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. పేదల, వృద్ధులు ఇబ్బంది పడకుండా కంటి చూపు ప్రసాదించాలన్న ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని తెలిపారు.
వరిలో నంబర్ వన్
వరి పంట విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే నంబర్ వన్గా ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ధాన్యం దిగుబడిలో పంజాబ్ను దాటేసి నంబర్ వన్ స్థానంలోకి వచ్చామని చెప్పారు. ‘గత యాసంగిలో దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే.. తెలంగాణలోనే 56.40 లక్షల ఎకరాల్లో సాగుచేశాం.
వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు.. తదితర అనేక రంగాల్లో తెలంగాణ ఎన్నో అవార్డులను సాధించింది. ముఖ్యంగా ఐటీ రంగంలో 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే, ప్రస్తుతం రూ.2.47 లక్షల కోట్లకు చేరాయి. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నాం. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకం పూర్తయితే గద్వాల వజ్రపు తునక అవుతుంది. చేజారిపోయిన ఆర్డీఎస్, తుమ్మిళ్ల పథకాలను తిరిగి సాధించుకొన్నాం. రాబోయే రోజుల్లో జోగుళాంబ గద్వాల జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుంది. గద్వాల, నారాయణపేట జిల్లాలకు మెడికల్ కళాశాలలు వస్తాయి. ఇది ఈ ప్రాంత ప్రజలకు వరం లాంటిది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 5 మెడికల్ కళాశాలలు రావడం సంతోషం’ అని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు రూ. 1,600 కోట్లతో ఐడీవోసీలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 20 ప్రారంభించామని, గద్వాల జిల్లా 21వది అని చెప్పారు. చేనేతకు గద్వాల ప్రసిద్ధి చెందిందని, ఇక్కడి చీరలు దేశానికి ఐకానిక్గా మారాయని ప్రశంసించారు. సమావేశంలో మంత్రులు మహమూద్అలీ, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, డీజీ పీ అంజనీకుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.