హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సంకుచిత రాజకీయాల కోసం బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. రాళ్లు వేసి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, తాత్కాలికంగా వచ్చే భావోద్వేగాలతో లబ్ధి పొందటం వాళ్ల ట్రిక్కు అని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్న రాష్ర్టాల్లో మతగజ్జి రేపడం బీజేపీ చిల్లర షార్ట్కట్ మెథడ్ అని విమర్శించారు. దీనికి దేశం అతిభారీ మూల్యం చెల్లించుకోబోతున్నదని హెచ్చరించారు. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును భ్రష్టుపట్టించడం ఇందుకు ఉదాహరణ అని, ఇలాగే కొనసాగితే దేశం వందేండ్లు వెనక్కి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ దుష్ట విధానాలను వివరించారు.
తాను ఇటీవల ఢిల్లీలో 8 రోజులు గడిపిన సందర్భంగా చాలామంది మిత్రులు, రాజకీయ నాయకులు, ఎకానమిస్టులు కలిశారని కేసీఆర్ చెప్పారు. కేంద్రం చేస్తున్న దుర్మార్గాల గురించి భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తున్నదన్నారు. బీజేపీ దుర్మార్గ, అనారోగ్యకర, అనాలోచిత విధానాలతో సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు. ‘జీడీపీ నాశనం అయ్యింది. ఎకానమీ చెల్లాచెదురైంది. నిరుద్యోగ సమస్య పెరిగింది. ఆరోగ్య సమస్యలు పెరిగినయి. పరిశ్రమలు మూతపడుతున్నయి. హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచీ)లో క్షీణించినం. సెస్సుల రూపంలో ఇబ్బడిముబ్బడిగా పన్నులు విధిస్తున్నది. నిత్యావసరాల ధరలు పెంచుతున్నది. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నది’ అంటూ ధ్వజమెత్తారు.
బీజేపీవాళ్లకు అహంకారం తలకెక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైనా రాగానే కాశ్మీర్ ఫైల్స్.. ఫుల్వామా.. అంటూ మతగజ్జికి సంబంధించిన చిల్లర షార్ట్కట్ మెథడ్లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్వేగపర్చడం, పది ఓట్లు సంపాదించుకోవడం వారికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు శ్రీరామనవమి పండుగను ఉదాహరణగా చెప్పారు. ‘నవమి పండుగ దేశమంతా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో జరిగింది. అయితే ఎన్నికలు రాబోయే రాష్ర్టాల్లో ఏం జరుగుతున్నదో, ఎన్నికలు లేని రాష్ర్టాల్లో ఏం జరుగుతున్నదో ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. గుజరాత్లో, కర్ణాటకలో రాళ్లు వేస్తరు.. మరి వేరే రాష్ట్రంలో ఎందుకో వేయరు! ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ డ్రామా స్టార్ట్ చేయడం, రాళ్లు వేసి ఉద్రిక్తతలు సృష్టించడం, ఆ ఉద్వేగంలో నుంచి వచ్చేదాన్ని రాజకీయం చేయడం.. ఈ చిన్న ట్రిక్కు అడ్డం పెట్టుకొని ఎన్ని తప్పులు చేసినా దీని ముందు చెల్లాచెదురు అయితదనే దిక్కుమాలిన ఆలోచనతో దేశాన్ని సర్వభ్రష్టం చేస్తున్నరు’ అని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమన్నారు.
బెంగళూరు అద్భుతమైన నగరమని, అనేక ప్రభుత్వాల కృషి ఫలితంగా అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కీర్తి పొందిందని సీఎం చెప్పారు. ఐటీ రంగంపై 30 లక్షల మంది ప్రత్యక్షంగా, మరో 30 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అంత అద్భుతమైన రాష్ట్రంలో ఆరు రకాల నిషేధాలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. హిజాబ్, హలాల్ మాంసం వంటివాటిపై నిషేధం విధించారని, ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కొద్దని, ముస్లింల షాపుల్లో ఖరీదు చేయొద్దంటూ పనికిమాలిన విషయాలు తెరమీదికి తెచ్చారని విమర్శించారు. దేశంలో మతం పేరుతో బీజేపీ చేస్తున్న ఈ దుర్మార్గ విధానాల ఫలితాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయని హెచ్చరించారు. ఇటీవలే కువైట్లో 11 మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారని ‘భారత్లో వ్యవహారం బాగాలేదు, వాళ్లు మన దగ్గర ఉంటే అంతే దుర్మార్గంగా మారుతుంది, కాబట్టి వాళ్లందరినీ దేశం నుంచి వెళ్లగొట్టండి’ అని కోరారని తెలిపారు. మన దేశానికి చెందిన సుమారు 13 కోట్ల మంది వివిధ దేశాల్లో స్థిరపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారని, కువైట్ మాదిరిగానే ప్రపంచం మొత్తం తరిమేస్తే వాళ్లను ఈ బీజేపీ పోషిస్తుందా? వాళ్లకు మన దేశంలో ఉద్యోగాలు ఇస్తారా? అని నిలదీశారు.
మన దేశం బుద్ధిజీవుల దేశమని తాను బలంగా నమ్ముతాని కేసీఆర్ అన్నారు. దేశం స్పందిస్తుందని (ఇండియా రియాక్ట్స్) ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇయ్యాల అధికారంలో ఉన్నమని, అహంకార పూరిత మాటలు మాట్లాడితే.. రాష్ర్టాల నుంచి వచ్చే మంత్రులను, ప్రభుత్వాలను అరాకరిగా, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే భారత ప్రజలు తిప్పి కొడుతరు. ఎత్తి పడేస్తరు’ అని హెచ్చరించారు. హిట్లర్, ముస్సోలిని వంటివాళ్లే పోయారని, వీళ్లు అంతకన్నా గొప్పోళ్లు కాదని గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత దేశాన్ని చైతన్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తానని పునరుద్ఘాటించారు.
బీజేపీ విధానాల వల్ల ఉన్న పరిశ్రమలు మూతబడితే కార్మికుల గతి ఏం కావాలి? ఐటీ పరిశ్రమ బిస్తర్ కడితే ఉద్యోగుల పరిస్థితేంటి? పెట్టుబడిదారులు విముఖత చూపినా, పెట్టుబడులు రాకపోయినా.. కొత్త ఉద్యోగాల కల్పన జరుగకపోయినా నిరుద్యోగ యువత ఆశలన్నీ ఎటుపోవాలి? అని కేసీఆర్ ప్రశ్నించారు. మతపిచ్చితో, ఉద్వేగాలతో, అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయింది చాలన్నారు. దేశం అతి భారీ మూల్యం చెల్లించబోతున్నదని హెచ్చరించారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని అన్నారు. ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేధావులు కొట్టుకొనిపోతే దేశం వందేండ్లు వెనుకకు పోతుందని హెచ్చరించారు. ఈ ఉన్మాదులు, దుర్మార్గులు చేసే కుటిల, కుత్సిత విషయాలను దేశ ప్రజలు గ్రహించి తమను తాము రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.