ఈ వానకాలానికి సంబంధించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దొడ్డు వడ్లు కొనరంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో.. రైతుల్లో ఆందోళనను తొలగిస్తూ సీఎం కేసీఆర్ నేనున్నానంటూ అభయమిచ్చారు. గత వానకాలంలో, యాసంగిలో మాదిరిగానే ఈసారి కూడా రైతుల నుంచి ప్రతి గింజనూ సేకరించాలని నిర్ణయించింది. పంట చేతికొచ్చిన ప్రాంతాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గత వానకాలం, యాసంగిలో సేకరించినట్టుగానే ఈ వానకాలంలోనూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ శనివారం మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నది. రికార్డుస్థాయిలో ఈ సీజన్లో 135 లక్షల టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. గత వానకాలంలో ప్రభుత్వం 48.85 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఈ సీజన్లోనూ ఉప్పుడు బియ్యం తీసుకోరని, కేవలం రా రైస్ (పచ్చి బియ్యం) మాత్రమే తీసుకుంటారని వార్తలు రావడంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వానకాలం సీజన్లో మెజార్టీగా రా రైస్ ధాన్యమే వస్తుందని, ఇబ్బందేమీ లేదని అధికారులు తెలిపారు. వచ్చే యాసంగిలో మాత్రం బాయిల్డ్ రైస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని ఢిల్లీ సర్కారు ఇప్పటికే స్పష్టంచేసిన విషయం తెలిసిందే.