హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ వెంట బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు చర్చించనున్నారు.
యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ క్రమంలో కేంద్రంతో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు.
మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై స్పష్టత, కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు, రాష్ట్ర విభజన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో సమావేశమై చర్చించే అవకాశాలున్నాయి.