CM KCR | పోడుభూములు కొట్టేసినందుకు ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు.
‘ తెలంగాణ ఉద్యమం సమయంలో అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు.. మావా నాటె.. మావా రాజ్.. నా గూడెంలో నా రాజ్యం.. మా తండాలో మా రాజ్యం అని చెప్పేవాళ్లు. అనేక దశాబ్దాలు మీరు పోరాటం చేసినా అది సాధ్యం కాలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4వేల గిరిజన గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు.. కుమ్రంభీమ్ పేరిట కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యమం సమయంలో మీరంతా సహకరించి నాతో పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే కుమ్రంభీమ్ జిల్లా వచ్చింది. ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా చాలా చక్కటి ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు బెజ్జూర్ నుంచి ఆదిలబాద్ పోవాలంటే చాలా బాధపడేవాళ్లు. కానీ ఇప్పుడు జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, ఇంకా చాలా జిల్లా కార్యాలయాలు మీ ముంగిట్లకే రావడం చాలా సంతోషించే విషయం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘ వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని ఒకప్పుడు పేపర్లో వార్తలు వచ్చేవి. అంటురోగాలతో ఆదిలాబాద్ ఆడవిబిడ్డలు సతమతమై చనిపోయేవాళ్లు. మిషన్ భగీరథ ద్వారా చక్కటి నీళ్లు తెచ్చుకున్నాం. వైద్య వ్యవస్థను బాగుచేసుకున్నాం కాబట్టి ఇవాళ మన్యం మంచం పట్టే సమస్య లేనే లేదు. గత మూడేండ్లుగా అటువంటి దుస్థితి నుంచి బయటపడ్డాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడం చాలా అద్భుతమైన విషయం. ఆ విషయంలో కూడా సక్కూ గారికి, లక్ష్మీగారికి, మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు.’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘ కోనేరు కోనప్ప వెంటబడి ప్రాణహిత మీద బ్రిడ్జి మంజూరు చేయించారు. కొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ఇప్పుడు కౌటాల మండలం నుంచి వార్దా నది మీదుగా మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి కావాలని చెప్పిండు. 75 కోట్లతో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ జీవోను ఇప్పుడే అందజేస్తున్నా. ఆసిఫాబాద్కు టెక్నికల్ కాలేజీ కావాలని కోనప్ప అడిగారు. వెంటనే ఐటీఐ కాలేజీని కాగజ్నగర్కు మంజూరు చేస్తున్నా అని తెలియజేస్తున్నా. నాగమ్మ చెరువులో బుద్ధుడిని పెట్టుకున్నాం.. దాన్ని మినీ ట్యాంక్బండ్లా ఏర్పాటు చేయాలని అడిగారు. వెంటనే ఎస్టిమేట్ చేయించి నాగమ్మ చెరువును కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ‘ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘ తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక్క ఆసిఫాబాద్ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం. ఇందాకే డజన్ పట్టాలు అందజేశా. రేపట్నుంచే మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు. రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. పట్టాలు అందడమే కాదు.. అందరూ రైతులకు వచ్చినట్టుగా పోడు పట్టాలు పొందినవారికి ఈ ఫసల్ నుంచే రైతుబంధు రాబోతున్నది. గతంలో 300 కోట్లు పెట్టి ఎక్కడెక్కడ అటవీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీఫేజ్ వైర్ కనెక్షన్ లేదో అక్కడ 300 కోట్లు పెట్టి కరెంట్ ఇవ్వమని చెప్పినం. అయితే బావుల్లోకి ఇంకా పోలేదని సక్కూగారు చెప్పారు. దీనిపై చీఫ్ సెక్రటరీకి ఆదేశాలివ్వడం జరిగింది. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్ కరెంట్ లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడం జరగుఉతుంది. పోడుభూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల మీద గతంలో కేసులు పెట్టిండ్రు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాం.. వారిపై కేసులు ఉండవు. ‘ అని సీఎం కేసీఆర్ తెలిపారు.