CM KCR | నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మాకు ఇంజినీరింగ్ కాలేజీ కావాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. వెనుకబడ్డ ప్రాంతంలో రావాల్సి ఉంది కాబట్టి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేద్దాం. ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆలోచిద్దాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
గతంలో వర్షాకాలం వచ్చిదంటే ఆదిలాబాద్ జిల్లాలో అంటురోగాలతో మనషులు చనిపోయేవారు. గత నాలుగైదు ఏండ్ల నుంచి ఎక్కడా కూడా ఒక మనిషి చావడం లేదు. పరిశుద్ధమైన మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా అందుతున్నాయి. ఆ మరణాల నుంచి బయటపడ్డాం, అంటురోగాల నుంచి తప్పించుకున్నాం. నాలుగు మెడికల్ కాలేజీలు అంటే నాలుగు సూపర్ స్పెషాలిటీలు ఆస్పత్రులు వస్తున్నాయ. ఏదైనా జబ్బు చేస్తే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇంత గొప్పగా జరుగుతున్న అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించుకుంటూ.. మన ఐకమత్యాన్ని కొనసాగించుకుంటూ ముందకు పోదాం. రైతులను, పేదలను కాపాడుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు.