హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఆదివాసీ కళ అయిన డోలు వాయిద్యంలో విశేష కృషిచేసి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సకిని రామచంద్రయ్యకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.కోటి నగదు, ఇంటి స్థలం ప్రకటించారు. రామచంద్రయ్య జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు రూ. కోటి నగదు సహాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. రామచంద్రయ్య మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళను బతికిస్తున్న రామచంద్రయ్యను సీఎం అభినందించారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. ఇంటి జాగ ఇవ్వటంతోపాటు నిర్మాణానికి సంబంధించి పనులను సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావును సీఎం ఆదేశించారు. సీఎంను కలిసినవారిలో మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తకెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మెతుకు ఆనంద్, గణేశ్ బిగాల, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.
పద్మశ్రీ కనక రాజుకు రివార్డు ఇంటి స్థలం, కోటి సాయం
గతేడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతోపాటు నిర్మాణం ఖర్చుల కోసం రూ.కోటి సాయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సకును ఆదేశించారు.