హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన డోలు వాద్యకారుడు రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం చేశారు. కోటి రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం ఆయనకు కోటి రూపాయలు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రామచంద్రయ్య డోలు వాద్యంలో ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను రామచంద్రయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివాసీ కళను బతికిస్తున్నందుకు సీఎం కేసీఆర్.. రామచంద్రయ్యకు అభినందనలు తెలిపారు.
తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాతామధు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మెత్కు ఆనంద్, గణేశ్ బిగాల, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణం ఖర్చుల కోసం కోటి రూపాయలను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు.