11,103 కాంట్రాక్టు పోస్టుల క్రమబద్ధీకరణ
80,039 ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్లు
ఇందులో ఉపాధ్యాయ పోస్టులే 20,964
గరిష్ఠ వయో పరిమితి పదేండ్లకు పెంపుదల
అసెంబ్లీలో కేసీఆర్ చరిత్రాత్మక ప్రకటన
95% ఉద్యోగాలు ఇక పూర్తిగా మనవాళ్లకే
అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే
విద్య, వైద్యం, భద్రత రంగాలకు పెద్ద పీట
స్థానికత సమస్యకు శాశ్వత పరిష్కారం
రికార్డు స్థాయిలో 503 గ్రూప్1 పోస్టుల భర్తీ
వర్సిటీల్లో 4,294 బోధన, బోధనేతర పోస్టులు
ఇకపై ప్రతి సంవత్సరమూ జాబ్ క్యాలెండర్
కాంట్రాక్టు కొలువుల్లేవు.. నాన్ లోకల్ లేదు
శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినం. నాలుగురోజులు ఆలస్యమైతే అయ్యింది కానీ.. శాశ్వతంగా ఈ సారి నుంచి ఏ ఉద్యోగం వచ్చినా తెలంగాణ యువతకే 95% ఉద్యోగాలు వస్తయి. కేవలం ఐదు శాతమే ఓపెన్ క్యాటగిరీ పెట్టినం. అందులోనూ మనవాళ్లకే మరో 3 శాతం ఉద్యోగాలు వస్తయి. అంటే మొత్తానికి వందలో 98 శాతం మన ఉద్యోగాలు మనకే దక్కుతయి. – సీఎం కేసీఆర్
స్వరాష్ట్ర నినాదం ఇప్పుడు ఫలించిన విధానం ప్రకృతిని ధిక్కరించి ఎదురెక్కిన నీళ్లు… నీళ్లలా సకల జనుల్లోకి ప్రవహించిన నిధులు.. నిధుల వరదతో ఉరికొచ్చిన నియామకాలు! చరిత్రను మార్చినా కేసీఆరే! కొత్త చరిత్రను కూర్చినా కేసీఆరే!
ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా!
ఎవరన్నా చేసిన్రా ఇట్లా!
రాష్ట్ర చరిత్రలో.. కాదు; దేశ చరిత్రలో.. కాదు; ప్రపంచ చరిత్రలో.. మొగోళ్లు, మొనగాళ్లు అనుకున్న నేతలెవ్వరైనా.. ఏ సీఎం అయినా, ఏ ప్రధాని అయినా.. ఎవరన్నా చేసిన్రా ఇట్లా… ఎప్పుడన్నా!
నిండు శాసనసభలో నిట్టనిటారుగా నిలబడి…
‘ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలు నింపినం. ఇప్పుడు ఇగో 91 వేల పైచిలుకు నింపుతున్నం. రేపటి నుంచే నోటిఫికేషన్లు వస్తయి’ అని బాజాప్తా ప్రకటించిన నాయకుడు చరిత్రలో ఇంకెవరైనా ఉన్నారా! ‘తెలంగాణ గడ్డ మీది ఉద్యోగాలన్నీ తెలంగాణ బిడ్డలకే దక్కేలా చేశాం’ అని అసెంబ్లీ సాక్షిగా ఉద్ఘాటించిన నాయకుడు వేరెవరైనా ఉన్నారా? ‘ఉద్యోగాల దోపిడీకిక అంతం. ఈ పంతం శాశ్వతం. ఈ నిర్ణయం ఇర్రివర్సబుల్’ అని రాజ్యాంగబద్ధంగా చేసిన కట్టడిని పట్టుదలగా ప్రకటించిన నాయకుడు
ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప!!
తెలంగాణలో ఉద్యోగ పర్వం మొదలైంది. కొత్త కొలువుల జాతరకు తెలంగాణ యువత బోనమెత్తింది. రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. సంచలనం సృష్టించారు.
ఒకేసారి 91 వేలకుపైగా ఉద్యోగాల భర్తీని ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన కేసీఆర్ సర్కారు, తాజాగా 91 వేల నియామకాల ప్రకటనతో, పదేండ్ల పాలన కాలంలో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టవుతున్నది. ఇది దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. అంతేకాదు.. ఒకేసారి 503 గ్రూప్1 పోస్టులను భర్తీ చేయడమూ రికార్డే.
తెలంగాణ ఇప్పుడు శిథిల స్వప్నాల నుంచి జీవన సౌరభాలు విరజిమ్ముతున్నది ..
హైదరాబాద్, మార్చి 9 : మన నియామకాలు మనకు వచ్చేశాయి. దశాబ్దాల ఉద్యమ ఆకాంక్ష ఫలాలనిస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఒకే దఫాలో 11,103 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా 80,039 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం శాసనసభ సాక్షిగా విస్పష్టమైన ప్రకటన చేశారు. వీటికి నోటిఫికేషన్లు సత్వరమే విడుదలవుతాయని ప్రకటించారు. యూనిఫాం సర్వీసులు మినహా మిగిలినవాటికి గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు, భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన పాఠం..
తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత దిగువస్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా.. అంటే అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాల పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగిందని చెప్పడానికి గర్విస్తున్నాను.
కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా, స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత ఉత్తర్వుల ప్రకా రం ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, తదితర గ్రూప్1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చాం.
గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకూ 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్, మల్టీజోన్లలో 95% రిజర్వేషన్ కలిగి ఉండటమే కాకుండా, ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో 5శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.
నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీపడటానికి గతం కన్నా ఎకువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. 7 జోన్లు, 33 జిల్లాలవారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది వంటి సమస్యలు తీరుతాయి.
కొత్త రాష్ట్ర ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతోపాటు ఉద్యోగులు, ఆస్తుల విభజనతో కూడుకొన్న ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలు మాత్రమేగాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేరొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన కూడా ముడిపడి ఉన్నది. అయితే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సంబంధమున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్థరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికితోడు కేంద్రం బాధ్యతారాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంసరణలను అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరించి, బలోపేతం చేసే దశగా చర్యలు తీసుకొన్నాం.
సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సజావుగా సాగటం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతోపాటు ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, మొత్తం 1,56,254 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 1,33,942 పోస్టులు భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.
జోన్ల వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తయ్యింది.
పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత.. ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రతి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కొత్త స్థానిక క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చింది. ఖాళీల భర్తీ గురించి నోటిఫికేషన్లు జారీ చేయటానికి మార్గం సుగమమైంది.
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులుండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాతాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గత డిసెంబర్ 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవు.
వర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,274 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీ లు 91,142 ఉన్నాయని తేలింది. 11,103 కాంట్రా క్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరు గా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్టు తేలింది. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు రూ.7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకొన్నది. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ఏటా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి. పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ఏటా ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తా యి. ఉద్యోగార్థులు అన్ని పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోలీస్శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యేక నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ఓబీసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ఠ వయోపరిమితి పెరుగుతుంది.