ఉద్యమ నేల తెలంగాణ చూసిన సభలెన్నో.. కానీ ఇది నేటికాలపు విరాట్రూపం. రేపటి నవోదయాన్ని సూచిస్తూ సూరీడు పశ్చిమ తీరానికి వాలనున్న వేళ.. రాబోయే యుద్ధానికి కాబోయే సైన్యమన్నట్టుగా నేల ఈనినట్టుగా జనం.. దేశంలో ఇక రాజకీయ భూకంపమే.. దానికి కేంద్రం తెలంగాణే అని చాటి చెప్తున్నట్టుగా..!
దమ్మున్న నగారా.. అది ఖమ్మం డిక్లరేషన్!
బీజేపీ మోదీ.. ఈ దేశం మాది, మా అందరిది!
చాలిక మీ అ-రాజకీయం.. కావాలి ప్రగతి రథం!!
స్వర్ణ భాండం భరత ఖండం.. చూపిస్తాం నవ్య పథం!!!
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురేలేదని విర్రవీగుతున్న బీజేపీ అధికార మూకకు అదురు బెదురు పుట్టించేలా, కేంద్ర పీఠం దద్దరిల్లేలా, ఢిల్లీ కోటను బద్దలు కొడతామన్న ఆ షడ్జధ్వానం బీఆర్”ఎస్’! సమ రాంగణ మహారథి మన కేసీఆర్!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ (తొలి) సభలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, కేరళ సీఎం విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేశ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర ఉద్దండ నాయకులు పాల్గొన్నారు. ‘ఎటు చూస్తే అటు జనం. ఏమి జనం.. ఎంత జనం.. ఇది జనమా? ప్రభంజనమా?’ అని అగ్ర నాయక శ్రేణి ఆశ్చర్యచకితులై నివ్వెర పోతుండగా, అఖండ జనవాహిని దిక్కులు పిక్కటిల్లేలా, వింధ్యకు ఆవలిదాకా వినిపించేలా చేసిన ప్రచండ ఘోష పరమార్థం.. కేసీఆర్ చెప్పినట్టు ‘పరివర్తనకు దేశం సిద్ధం.. అందుకిదే ప్రబల సంకేతం’!!
బీఆర్ఎస్ కుంభమేళా సందేశం సుస్పష్టం. కేజ్రీవాల్ ప్రకటించినట్టు కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల ‘పెద్దన్న’! బీఆర్ఎస్ ఇప్పుడు ముందుండి దారిచూపే దివిటీ! నకిలీ గుజరాత్ ఇంకెంతమాత్రం మాడల్ కాదిక! నికార్సైన తెలంగాణే నమూనా.. దేశం మూల మూలనా!! తెలంగాణలోని కంటి వెలుగు సహా పలు పథకాలను తామూ అమలు చేస్తామని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించడమే అందుకు సూచన!
తెలంగాణ రాష్ట్రం కోసం దేశంలోని అన్ని పార్టీలతో జై తెలంగాణ అనిపించిన కేసీఆర్ ఇప్పుడు భారతదేశం కోసం దేశంలోని అన్ని పార్టీలతో జై భారత్ అనిపిస్తున్నారు. సభ ముగిసింది. సమరం మొదలైంది. నమూనా సిద్ధంగా ఉంది.
తెలంగాణ ఉద్యమంలాగే ఇక భారత ఉద్యమం!
విద్వేష శక్తుల చెర విడిపించే విమోచనా సంగ్రామం!!
ఇక మొదలుపెడదామా? కమలమా.. ఉలికిపడు!
కొంచెం నష్టమొస్తే, దాన్ని ప్రజల మీద రుద్దాలె. ధరలు పెంచాలె. సామాన్యుల మీద ట్యాక్స్లు వెయ్యాలె. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్.. ఇదీ నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైన విధానం. అందుకే ఇది పెట్టుబడిదారీ ప్రభుత్వం. దోపిడిదారు ప్రభుత్వం. నేను సీదా చెబుతున్న నరేంద్ర మోదీకి. అయ్యా మోదీగారూ.. మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్.
కర్షక వీరులు, కరెంట్ కార్మికులు, మహిళా సోదరీమణులు, దళిత బిడ్డలు అందరం ఏకమైతే అసమర్థ పాలకులను సాగనంపడం కష్టమేమీ కాదు. ఒక ఉజ్వలమైన భారతదేశాన్ని ఆవిష్కరించు కోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. న్యాయం, ధర్మం ఎప్పుడూ గెలిచి తీరుతాయి. అంతిమ విజయం మనదే.. మనదే.. మనదే.. జై భారత్.. జై జై భారత్.. – ముఖ్యమంత్రి కేసీఆర్
మోదీతో భారత్ బర్బాద్.. మా పెద్దన్న కేసీఆర్: కేజ్రీ
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడం పైనే ప్రధానమంత్రి మోదీ దృష్టి పెడుతున్నారు. 24 గంటలూ ఎవరిని ఎలా ఇబ్బందిపెట్టాలి? ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి? అనే ఆలోచనతోనే ప్రధాని మోదీ ఉంటారు. దేశాన్ని బాగు చేస్తాడని నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే ఆయన భారత్ను బర్బాద్ చేశాడు. కేసీఆర్ మా పెద్దన్న. ఈ రోజు ఆయనతో ముగ్గురు ముఖ్యమంత్రులం ఉన్నాం. ప్రగతి విషయంలో ఒకరి నుంచి ఒకరం స్ఫూర్తి పొందుతుంటాం.
రాష్ర్టాలను దివాలా తీయించే కుట్ర: విజయన్
పదేండ్ల్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ర్టాల హక్కులను హరిస్తున్నది. రాష్ర్టాలను ఆర్థికంగా దివాలా తీయించేందుకు కుట్ర చేస్తున్నది. రాష్ర్టాలపై ఆర్థిక ఆంక్షలను పెడుతున్నది. రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడేలా చేస్తున్నది. ఒకే భావజాలం ఉన్నవారిని బీఆర్ఎస్ ఒకే వేదికపైకి తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ తరహా రాజకీయ సమీకరణ అవసరం. దేశ ప్రజలు దీనినే కోరుకుంటున్నారు.
ఖమ్మం నుంచే బీజేపీని దించే పోరాటం: మాన్
అబద్ధాలతో అధికారం చేపట్టిన బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలున్న రాష్ట్రాల్లోనూ అడ్డదారిన గద్దెనెకాలని కుట్రలు పన్నుతున్నది. ప్రజా ప్రభుత్వాలను కూల్చేవారికి ప్రజలే బుద్ధి చెప్తారు. వారికి కోపమొస్తే నేలకేసి కొడతారు. చరిత్రలో ఇలాంటివి కోకొల్లలు. త్వరలో బీజేపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. స్వాతంత్య్రం సాధించి 75 ఏండ్లు గడిచినా, ప్రతి ఏడాది ఎర్రకోటనుంచి పాలకుల ప్రసంగాల్లో మార్పేమీ లేదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ దేశాన్ని భ్రష్టు పట్టించాయి.
బీజేపీ సర్కారుకు మిగిలింది 399 రోజులే : అఖిలేశ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేవలం 399 రోజులే మిగిలాయి. బీజేపీ నాయకులే స్వయంగా తమ ప్రభుత్వ సమయాన్ని లెకించుకుంటున్నారంటే, తమ ప్రభుత్వం మళ్లీ గెలవదన్న సంగతి వారికి కూడా అర్థమైంది. ప్రజలకు వివిధ రకాల భ్రమలు కల్పించి రెండుసార్లు గద్దె నెకిన బీజేపీ అన్నిరంగాలను ధ్వంసం చేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ భ్రమలు తొలిగిపోతాయి. ప్రజలే దాని సంగతి చూస్తారు.
బీజేపీని ఓడించడమే అందరి కర్తవ్యం: డీ రాజా
దేశానికి బీజేపీ, ఆరెస్సెస్లతో అతిపెద్ద ముప్పు ఉన్నది. సమాఖ్య స్ఫూర్తిని అవి దెబ్బతీస్తున్నాయి. సెక్యులర్ శక్తులన్నీ కలిసి పోరాడితే తప్ప దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోలేం. పేదలు, రైతుల పక్షాన బీజేపీ నిలబడలేదు. బడాబాబులకే మోదీ రెడ్కార్పెట్ పరుస్తున్నాడు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీలో ఏం జరుగుతున్నదో ప్రజలందరూ చూస్త్తున్నారు. బీజేపీని ఓడించడమే ఇప్పుడు అందరిముందున్న కర్తవ్యం. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలి.
బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభావేదికపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాటాముచ్చట
హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): ‘మోదీది దోపిడీదారు ప్రభుత్వం. ప్రజలను దోచుకుంటున్నది. మోదీది పెట్టుబడిదారీ ప్రభుత్వం. కొద్దిమంది షావుకారులకు ప్రజలసంపదను, ప్రభుత్వసంస్థల్ని అప్పనంగా అమ్ముతున్నది. అందుకే మరోసారి చెప్తున్న. అన్నీ అమ్మేస్తానంటున్న మోదీ.. అమ్మేయ్ ఫర్వాలేదు. 2024 తర్వాత మీరు ఇంటికి. మేం ఢిల్లీకి. జరిగేది ఇదే’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ‘డొల్ల మాటలు, కల్ల మాటలు చెప్తూ పొద్దుపుచ్చే పరిపాలకులే ఉండాల్నా? 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కడుపునిండా మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు కావాల్నా?’ అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. కర్షక వీరులు, కరెంట్ కార్మికులు, మహిళా సోదరీమణులు, దళిత బిడ్డలు, యువకులు అందరూ ఏకమైతే కేంద్రంలోని మోదీ అసమర్థ పాలనను సాగనంపడం కష్టమేమీ కాదన్నారు. పాలకులు పెడుతున్న కష్టాల నుంచి భారతజాతిని విముక్తి చేసి, ఉజ్వలమైన భారతదేశాన్ని ఆవిష్కరించుకోవడం కోసమే భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని ప్రకటించారు. ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్ తొలి బహిరంగసభలో సింహగర్జన చేసిన కేసీఆర్.. బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. జాతిజనులను జాగృతం చేసే ప్రయత్నం చేశారు. దేశానికి బీఆర్ఎస్ ఏం చేయబోతున్నదో విస్పష్టంగా వివరించారు. అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
నా అంతరాత్మ కలిచివేస్తున్నది…
ఈ రోజు కేసీఆర్ జాతీయ పాలసీ చెబుతారని పేపర్లు, టీవీల్లో వస్తున్నది. తప్పకుండా చెప్తాం.. కానీ ఇంత పెద్ద సభలో మొత్తం చెప్పలేము. ఇందుకు సంబంధించి కొన్ని స్థూలమైన విషయాలు చెబుతాను. బీఆర్ఎస్ పాలసీ ఏమిటి? వైఖరి ఏమిటి? ఏం చేయబోతున్నం? ఈ దేశానికి బీఆర్ఎస్ ఎలాంటి మార్గనిర్దేశనం చేస్తుంది? అనే అంశాలపై రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి డాక్యుమెంట్లో చెబుతాం. అయితే కొన్ని విషయాలను మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరమున్నది. ఒకే ఒక్కమాట నా మనసును అనేక రోజులుగా కలిచివేస్తున్నది. చాలా బాధ పెడుతున్నది. రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. గెలుస్తరు, ఓడుతరు ఏదో అయిపోతది. ఎందరు గెలువలేదూ, ఎందరు ఓడలేదూ..! ఇది పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజు మన దేశం యొక్క, భారత సమాజం యొక్క లక్ష్యం ఏమిటి? అసలు లక్ష్యమంటూ ఏమైనా ఉన్నదా? భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా? దారి తప్పిందా? బిత్తరపోయి గత్తరపడుతున్నదా? ఈ దేశంలో ఏం జరుగుతున్నది? ఇది నా అంతరాత్మను అనేక రోజులుగా కలిచివేస్తున్నది. మనందరం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయమిది.
అన్నీ ఉన్నా.. అడుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు?
ఒకమాట గతంలోనూ చెప్పిన. ఇప్పుడు మళ్లీ చెబుతున్న. ఈ దేశంలో ఎవరినీ అడుక్కునే అవసరం లేని, ఏ ప్రపంచబ్యాంకు నుంచీ అప్పు తీసుకునే అవసరం లేని, ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేని, ఏ విదేశీయుల సహాయం అవసరం లేని.. సహజ సంపద, ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల ఆస్తి దేశానికి ఉన్నది. ఆ సంపదంతా ఏమైతున్నది? సంపద లేక భిక్షమెత్తుకుంటే పర్వాలేదు కానీ, అపారమైన సంపద ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలి? నేను అనేక సందర్భాల్లో చెప్పిన. మళ్లీ చెప్తున్న. అమెరికా మనకన్నా రెండున్నర రెట్లు పెద్దది. కానీ వాళ్లకు ఉన్నటువంటి వ్యవసాయభూమి 29 శాతం మాత్రమే. చైనా మనకన్నా ఒకటిన్నర రెట్లు పెద్దది. వాళ్లకున్న సాగు భూమి కేవలం 16 శాతం. మొత్తం భారత భూభాగం 83 కోట్ల ఎకరాలుంటే అందులో సరాసరిగా 50 శాతం అంటే 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలం. అపారమైన జల సంపద ఉంది. ఈ దేశంలో 1.40 లక్షల టీఎంసీల వర్షపాతం కురుస్తుంది. ఇందులో రమారమి 70 వేల టీఎంసీలు ఆవిరైపోయినా, మనం ఉపయోగించుకునేందుకు 70-75 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. భూమి ఉంది, నీళ్లున్నయ్.
పంటలు పండేందుకు పుష్కలమైన సూర్యరశ్మి (సోలార్ ఇన్సిడెన్స్)ని కలిగిఉన్న అద్భుతమైన దేశం మనది. సముద్రతీర ప్రాంతాల్లో ఉండే తేమ వాతావరణం కావొచ్చు, సముద్రతీరం లేనటువంటి తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి ల్యాండ్లాక్డ్ రాష్ర్టాలు కావొచ్చు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి శీతల రాష్ర్టాలు కావొచ్చు.. మూడు విభిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. అందుకే భారత్లో ఆపిల్.. మామిడికాయ రెండూ పండుతాయి. ఇలాంటి పరిస్థితి ఇతర దేశాల్లో ఉండదు. అదేవిధంగా కష్టించి పనిచేసే 139 కోట్ల జనాభా ఉన్నది. ఇన్ని కలిగిఉన్న దేశంలో మెక్డోనాల్డ్ పిజ్జాలు, మెక్డోనాల్డ్ బర్గర్లా మనం తినేటివి? ప్రపంచానికి అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి, అద్భుతమైన పంటలు పండించి, సాగునీళ్లన్నీపైకి తెచ్చి, దానికి అనుబంధంగా ఫుడ్ప్రాసెస్ ఇండస్ట్రీ పెట్టి, అందులో కోటానుకోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్చైన్ ఆఫ్ వరల్డ్గా ఉండాల్సిన ఇండియా.. కెనడా నుంచి కందిపప్పును దిగుమతి చేసుకుంటుందా? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమన్న ఉంటదా? లక్షల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటదా? ఇది నిజం కాదా?
దేశానికి ఒక లక్ష్యముందా..?
కేంద్రప్రభుత్వ సంస్థ సీడబ్ల్యూసీ చెప్పిన లెక్కల ప్రకారం.. 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే, ఈ రోజు దేశం వాడుకుంటున్నది నికరంగా 19 వేల నుంచి 20 వేల టీఎంసీలు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కోట్లాది మందికి విషపు మంచినీళ్లేనా గతి? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరీ పాపాత్ములు? అందుకే నేను అడిగేది. దేశానికి ఒక లక్ష్యముందా? మనం లక్ష్యాన్ని కోల్పోయాం. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన ప్రాజెక్టులు తప్ప.. ఆ తర్వాత అతీగతీ లేదు. ట్రిబ్యునల్ వేస్తరు. మన రాష్ట్రమే ఉదాహరణ. కృష్ణాజలాల వివాదం మీద బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ వేశారు. 19 ఏండ్లు గడిచి 20 ఏండ్లు అవుతున్నది. ఇప్పటికీ హరీ లేదు శివా లేదు. ఆ జడ్జి గారిని నలుగురు పట్టుకొచ్చి చైర్లో కూర్చోబెడ్తరు. ఆయన ఎప్పుడు హరీమంటడో తెల్వదు. 20 ఏండ్లు దాటుతుంటే, ట్రిబ్యునల్ ఉలుకూ పలుకు లేకపోతే, ఆయన ట్రిబ్యునల్ తీర్పు చెప్పేది ఎప్పుడు? డిజైన్లు అయ్యేది ఎప్పుడు? నిధులు సమకూరేది ఎప్పుడు? ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? ప్రజలకు సాగు, తాగునీరు వచ్చేదెప్పుడు? దీనికి అమెరికాను అడుక్కోవాల్నా? అంతర్జాతీయ రాజనీతి కావాల్నా? ప్రపంచబ్యాంకు వద్ద చిప్ప పట్టుకోవాల్నా? అవసరం లేదే? ఇది ఫ్యాక్ట్ కాదా? ఇది చేతగాదు. మంచినీళ్లు ఇవ్వ చేతగాదు. నదుల నీళ్లు సముద్రానికి పోతుంటే నోళ్లు వెళ్లబెట్టుకుని కహానీలు, కథలు చెప్తున్నరు.
ఒక్క భారీ ప్రాజెక్టుకు మనం నోచుకోవద్దా?
ఎక్కడ ప్రజల్ని గోల్మాల్ చేస్తున్నరు? ఎక్కడ మనం మోసపోతున్నం? జింబాబ్వే అనే చిన్నదేశంలో జాంబేజీ నది మీద 6,533 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. రష్యాలో అంగారా నదిపై 5,968 టీఎంసీల ప్రాజెక్టు, ఘనా దేశంలో ఓల్టా నది మీద 5,085 టీఎంసీల ప్రాజెక్టు, కెనడాలో మనీకూగాన్ నది మీద 4,944 టీఎంసీల ప్రాజెక్టు. ఈజిప్టులో నైలునది మీద 4,500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీనది మీద 1,400 టీఎంసీల త్రీగార్జెస్ డ్యాం ఉన్నది. అమెరికాలో కొలరాడో నది మీద 1,200 టీఎంసీల హూవర్ డ్యాం ఉన్నది. మరి మనదేశానికి ఏది? ఇంత సువిశాల దేశం. 139 కోట్ల జనాభా. కరువులు చూసినం.. కాటకాలు చూసినం. వరదలు చూస్తున్నం. అట్లాంటిది ఒక్కటి కూడా వద్దా మన ముఖానికి? దానికీ మనం నోచుకోలేదా? మంచినీళ్లకూ బాధపడాల్నా? నేను ఖమ్మం సభ ద్వారా ఒక్కటే ప్రశ్న దేశాన్ని అడుగుతున్న. సరైన పరిపాలన వచ్చి.. నదుల నీళ్లన్నీ భూమిమీదకు మళ్లి.. ప్రజల, పొలాల దాహం తీర్చాల్నా? మనం సన్నాసుల్లాగా ఇట్లనే ఉండాల్నా? దయచేసి దేశం ఆలోచించాలె. ఇది ప్రశ్నించడానికే, ఈ చైతన్యం తేవడానికే, ఇది సాధించడానికే పుట్టింది బీఆర్ఎస్ అని మనవి చేస్తున్నాను. ఇప్పటిదాక ప్రజలు వంచించబడ్డారు. తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం దేశవ్యాప్తంగా తెచ్చి, ప్రభుత్వాల మెడలు వంచి, సహజసిద్ధమైన, భగవంతుడు ఇచ్చిన ప్రకృతి సంపద భూమ్మీదకు రావాలె. దానికోసం పోరాటం రావాలె. లేదంటే మనం ముందుకు పోలేం. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాల్నా? తన్నీర్ తన్నీర్.. వంటి సినిమా వచ్చినా దాన్ని చూసైనా సిగ్గురాదా?
దేశాభివృద్ధే బీఆర్ఎస్ విధానం
జ్ఞానం ఎవరికైనా సొంతంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ, జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడి నుంచే స్వీకరించగలగాలి. మన పక్కనే ఉన్న చైనా ప్రపంచాన్ని శాసిస్తున్నది. 1980 వరకు మనకన్నా చైనా జీడీపీ చాలా తక్కువ. అణుబాంబుతో చెల్లాచెదురైన జపాన్ మళ్లీ కోలుకుని ప్రపంచంలో గొప్ప దేశంగా వెలుగొందుతున్నది. ఏమీలేని సింగపూర్ అద్భుతమైన ఆర్థిక ప్రగతితో మన కండ్లముందు కనబడుతున్నది. దక్షిణ కొరియా, మలేషియా ఇంకా ఎన్నో దేశాలు గొప్ప స్థానానికి ఎగబాకాయి. అట్లనే మనదేశం కూడా ముందుకు దూసుకెళ్లాని బీఆర్ఎస్ కోరుకుంటున్నది. అదే బీఆర్ఎస్ విధానం.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
ఈ దుర్మార్గానికి ఎవరండీ కారణం? కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. ‘భయ్యా హమ్నే కర్దియా.. ఇన్హోనే రోక్దియా!’ అంటూ కాంగ్రెస్ ఉంటే బీజేపీని, బీజేపీ ఉంటే కాంగ్రెస్ను తిట్టడం. మనకు కావాల్సింది ఈ తిట్ల పురాణామా? మన గొంతు తడవాల్నా? పొలాలు తడవాల్నా? అదేవిధంగా కరెంటు. దానికేమైందో నాకు అర్థం కాదు. ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 4.10 లక్షల మెగావాట్లు. ఏ రోజు కూడా 2.10 మెగావాట్లకు మించి దేశం వాడుకోలె. అనేక వేల మెగావాట్ల థర్మల్ పవర్స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే.. స్ట్రెస్డ్ అస్సెట్స్ అనే పేరు పెట్టి, ఎన్సీఐడీ పంచాయతీలు పెట్టి, వాటిని మూలకు పెడుతున్నరు. దేశమంతా ఇవ్వాళ కరెంటు కోత. తెలంగాణ తప్ప అన్ని రాష్ర్టాల్లో ఎక్కడ కూడా 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. ఏడేండ్ల కింద. తెలంగాణల ఏమున్నది? బీఆర్ఎస్ లాంటి భావజాలమున్న పార్టీలు అధికారంలోకి వస్తే రెండేండ్లలో వెలుగుజిలుగుల భారతదేశం మన తెలంగాణ వెలిగిపోయాలా చేస్తం. ఇది చాలెంజ్.
బీజేపీ అవలంబిస్తున్న విధానం దుర్మార్గం..
దేశంలో పరిస్థితి ఎట్లున్నది? ప్రస్తుతం బీజేపీ చెప్పే నీతి ఏందయ్యా అంటే.. కొంచెం నష్టమొస్తే, దాన్ని ప్రజల మీద రుద్దాలె. ధరలు పెంచాలె. సామాన్యుల మీద ట్యాక్స్లు వెయ్యాలె. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్.. ఇదీ నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైన విధానం. అందుకే ఇది పెట్టుబడిదారీ ప్రభుత్వం. దోపిడిదారు ప్రభుత్వం. నేను సీదా చెబుతున్న నరేంద్ర మోదీకి. అయ్యా మోదీగారూ.. మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇవ్వాళ ఎల్ఐసీని అమ్ముతా, అమ్ముతా అంటున్నవ్.. అమ్మేయ్! ఫర్వాలేదు. 2024 తరువాత మీరు ఇంటికి. మేం ఢిల్లీకి. గ్యారంటీకి మళ్లా ఎల్ఐసీని వాపస్ తీసుకుంటం. పబ్లిక్ సెక్టార్లోనే దానిని కొనసాగిస్తం. ఎల్ఐసీకి రూ.48 లక్షల కోట్ల ఆస్తులున్నయ్. లక్షలాదిమంది ఎల్ఐసీ ఏజెంట్లున్నరు. ఉద్యోగులున్నరు. భారతీయుల ఆత్మతోని, సామాన్య కుటుంబాలతోని పెనవేసుకుపోయిన పేగుబంధమున్న సంస్థ ఎల్ఐసీ. దాన్ని అప్పనంగా, అడ్డికి పావుశేరు చొప్పున, ఇష్టమొచ్చిన తమ షావుకార్లకు అమ్ముదామని మోదీ ఉవ్విళ్లూరుతున్నరు. అమ్మినా మళ్లా మేం వాపస్ తీసుకుంటం. ఎల్ఐసీ ఏజెంట్ మిత్రులారా..! కార్మికులారా..! సింహాల్లా గర్జించండి. బీఆర్ఎస్ను బలపరచండి. మనం ముందుకుపోదాం. ఎల్ఐసీని రక్షించుకుందాం. అదేవిధంగా కరెంటు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటిదాకా జెన్కోలు, ట్రాన్స్కోల ఆస్తులు, స్తంభాలు, స్టేషన్లు, లక్షలకోట్ల విలువ చేసే ప్రజల ఆస్తులను అప్పనంగా నష్టమేదో చూపించి షావుకార్లకు అమ్ముతామంటున్నరు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతిముఖ్యమైన విషయం. ప్రగతి సూచికల్లో మొదటిది అదే. కరెంటు రంగాన్ని కచ్చితంగా పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించాలి. అదే బీఆర్ఎస్ పాలసీ. దానినే డిమాండ్ చేస్తున్నాం. కరెంటు కార్మికులారా.. పిడికిలి బిగించండి. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో నిండా నీళ్లున్నా, గొంతుకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు కావాల్నా? మనకు సిగ్గురావద్దా? దయచేసి ఆలోచించాలె. మంచినీళ్లు, సాగునీళ్లు రావాల్నా? పనిచేయని నాయకులు ఇచ్చే లొడ లొడ ఉపన్యాసాలు విందామా? ఆలోచించాలె.
రైతులు ధర్నా చేయాల్సిన దుస్థితా?
రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలంటే దానిమీద 96 కథలు చెప్తరు. వాళ్లేదో దోపిడీదారులు అన్నట్టు చూస్తరు. రేవ్డీ కల్చర్ అని, ఉచితాలు అని పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతును అవమానపరుస్తరు. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. సిగ్గుపడాలె. ఇన్ని సంపదలు, భూమి ఉన్న దేశంలో రైతులు తమ సమస్యల కోసం 13 నెలలు ఎండలో, వానలో ఢిల్లీలో ధర్నా చేయాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? దయచేసి ఆలోచన చేయండి.
ఇదేనా దేశాన్ని పాలించే విధానం? దేశానికి కావాల్సింది ఇదేనా? సుమారు 11 నుంచి 14 లక్షల కోట్లు ఎన్పీఏల పేరు మీద వాళ్లకు నచ్చిన పెట్టుబడిదారులకు దోచిపెట్టినారు కదా. మొత్తం భారతదేశమంతా మన తెలంగాణలో ఇస్తున్న విధంగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలె. దానికయ్యే ఖర్చు కేవలం లక్షా 45 వేల కోట్లు మాత్రమే. బీఆర్ఎస్, లేదంటే అది ప్రతిపాదించిన పార్టీలు అధికారంలోకి వస్తే.. భారతదేశం మొత్తానికి తెలంగాణ మాడల్లో ఉచిత కరెంటు సప్లయ్ చేస్తాం. రైతుల ఆత్మహత్యలు ఆపాలె. వ్యవసాయం స్టెబిలైజ్ కావాలె. రైతుబంధు ఇస్తే దానిమీద కథలు. తర్వాత వాళ్లే ఒప్పుకుని వాళ్లే ఇస్తరు. తెలంగాణ రైతుబంధు లాంటి స్కీమ్ భారతదేశమంతా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ నినాదం. బీఆర్ఎస్ డిమాండ్. కరెంటు విషయంలోనూ అదే పద్ధతిలో ముందుకుపోతాం.
డొల్ల మాటలు చెప్పే పాలకులే ఉండాల్నా?
దేశంలో ఈ నీటియుద్ధాలు ఎందుకు? సట్లేజ్ ఉపనదులైన రావి-బియాస్ జలాల కోసం పంజాబ్, హర్యానా రోజూ ఎందుకు తన్నుకోవాలె. మహానది నీళ్ల కోసం ఒడిశా- ఛత్తీస్గఢ్ యుద్ధం ఎందుకు చేయాలె? నర్మదా నీళ్ల కోసం గుజరాత్- మధ్యప్రదేశ్.. కావేరీ జలాల కోసం తమిళనాడు-కర్ణాటక.. గోదావరి నదిపై తెలంగాణ-ఆంధ్ర-మహారాష్ట్ర పంచాయతీ.. ఇవి ఇట్లనే కొనసాగాల్నా? చాటలో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు, రాష్ర్టాల మధ్య తాకులాటలు పెట్టడమేనా? పరిపాలన చేయరాక, చేతగాక, సహజ సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివిలేక, డొల్లమాటలు, కల్ల మాటలు చెబుతూ పొద్దుపుచ్చే పరిపాలకులే ఉండాల్నా? 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు కావాల్నా? నదుల నీళ్లు సముద్రానికి పోతుంటే నోరెళ్లబెట్టుకుని చూడాల్నా? మనకు సిగ్గు రావద్దా? దయచేసి ఆలోచన చేయాలి. 75 ఏండ్ల అసంబద్ధ విధానాలను ప్రశ్నించడానికి, కష్టాల నుంచి భారతజాతిని విముక్తి చేయడానికి పుట్టిందే బీఆర్ఎస్.
దేశమంతా దళితబంధు
ఈ దేశంలో దళితజాతి బిడ్డలు ఎవరికోసం వివక్ష అనుభవించాలె? ఇంకెన్నేండ్లు గోస పడాలె? అందుకే, తెలంగాణలో దళితబంధు పథకం పుట్టింది. కచ్చితంగా అంబేద్కర్ చూపిన బాటలో, కాన్షీరాం నడిచిన మార్గంలో దళితజాతి అభ్యున్నతి జరగాలి. భారత దళితజాతికి నేను పిలుపిస్తున్నాను. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా దళితులంతా ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాను. తెలంగాణ దళితబంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున దేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. ఇది చెయ్యకపోతే, కేంద్రానికి చేతకాకపోతే తప్పుకోండి. మేం చేసి చూపిస్తాం.
దేశంలోని ప్రతి ఇంటికీ మంచినీళ్లు
దేశ ప్రజలు ఏమడుగుతున్నారు? గొంతెమ్మ కోర్కెలు ఏమైనా కోరుతున్నరా? మంచినీళ్లు కావాలని అడుగుతున్నారు. దేశ ప్రధానినని ఇంత పొడుగూ అంత దొడ్డూ అని చెప్పే మోదీకి.. కనీసం మంచినీళ్లు ఇవ్వడం కూడా చేతకాదా? ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణలో పరిస్థితి ఏంది? ఇప్పుడేంది? మిషన్ భగీరథతో తెలంగాణలోని ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చినం. ఐదేండ్లలోపు విపక్షాల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి.. మిషన్ భగీరథ లాగానే దేశంలోని ప్రతి ఇంటికీ బ్రహ్మాండంగా నల్లా పెట్టి శుద్ధమైన మంచినీటిని అందిస్తాం. అదే బీఆర్ఎస్ పాలసీ. నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ, పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉన్నది. దేశంలో మేకిన్ ఇండియా.. జోకిన్ ఇండియా అయిపోయింది. మేకిన్ ఇండియా అంటరు కానీ, పూటకొకటి పేటకొకటి చైనాబజార్లు కనిపిస్తయి. (మొన్ననే ఒక పెద్దాయన ఫోన్ చేసిండు. సర్ మీ ప్రసంగం విన్న తర్వాత నాకే సిగ్గేసింది. చైనాబజార్ అనే పేరు తీసేసి భారత్ బజార్ అని పెట్టుకున్న అని చెప్పిండు)
విశాఖ ఉక్కును కార్మికులకే అప్పగిస్తాం
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతామని మోదీ అంటున్నారు. నేను ఇప్పటికే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అమ్మితే అమ్ముకోండి. కానీ.. విశాఖ ఉక్కును మేం మాత్రం ప్రైవేటుపరం కానివ్వం. విశాఖ ఉక్కును కార్మికుల చేతిలో పెడతాం. ఇది మా వాగ్దానం. రైళ్లు, విమానాలు ప్రైవేటుపరం చేశారు. చివరికి వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేసి.. రైతుల భూములను కార్పొరేట్ గద్దలకు అప్పగిస్తారట. అందులో రైతులే జీతానికి పనిచేసే దుస్థితిని తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒక్కటే.. ప్రజావ్యతిరేక బీజేపీ విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది.
చట్టసభల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు
అన్ని రంగాల్లో మహిళలను ఎక్కడైతే ఆదరించారో ఆ దేశాలు బాగుపడ్డాయి. మన దగ్గర మహిళలకు ఎంత తెలివి ఉన్నా, వంటింట్లోనే మగ్గాలి.. మేం మాత్రం బలాదూర్ తిరుగుతం.. మహిళలు మాత్రం ఇంటికే పరిమితం కావాలనే పద్ధతిలో మన దేశం ఉన్నది. ఈ లింగవివక్ష పోవాలి. మహిళల పాత్రను అన్నిరంగాల్లో పెంపొందించాలి. అందుకే, మహిళలకు చట్టసభల్లో 35 శాతం రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రాతిపాదిస్తున్నది.
అగ్నిపథ్ను రద్దుచేస్తాం
సైన్యంలో జరిగే నియామకాలకు ఒక పద్ధతి ఉండాలి. మిలిటరీ ఒక సిస్టమ్ను ఫాలో కావాలి. దాంట్లో కూడా వేలుపెట్టి తెలివితక్కువతో అగ్నిపథ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. విపక్షాల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ను రద్దు చేస్తుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతిలోనే సైన్యంలో నియామకాలు జరుగుతాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. ఇవాళ దేశంలోని పెద్దలందరూ చెప్పారు. బీజేపీ తమ వైఫల్యాలు, అసమర్థత, చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మత విద్వేషపు మంటలు రేపుతున్నారు. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్వధర్మ సమభావనే, సకల జనుల సంక్షేమమే భారత సాంస్కృతిక పరంపర.
ఈ మత విద్వేషపు విషవృక్షాలు పెరిగి పెద్దవైతే.. జాతి జీవనాడిని దహించి వేస్తుంటే.. ఎవరి కోసం మనం సహించాలి? ఎందుకోసం మౌనంగా ఉండాలి? దయచేసి కర్షక వీరులు, కరెంట్ కార్మికులు, మహిళా సోదరీమణులు, దళిత బిడ్డలు అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే. అందరం ఏకమైతే అసమర్థ పాలకులను సాగనంపడం కష్టమేమీ కాదు. ఒక ఉజ్వలమైన భారతదేశాన్ని ఆవిష్కరించుకోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. అందుకే ఇవ్వాళ ఇంతమంది పెద్దలు ఇక్కడకు వచ్చారు. కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్, డీ రాజా, అఖిలేశ్ యాదవ్ మన మధ్యకు వచ్చి సంఘీభావం తెలిపారు. విలువైన ప్రసంగాలు చేశారు. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ సమగ్ర పాలసీని ప్రజల ముందుంచుతాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సుమారు వందమంది బీఆర్ఎస్ పాలసీపై కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతున్నది. అవన్నీ త్వరలోనే దేశం ముందు పెడతాం. చర్చిస్తాం. సీపీఐ, సీపీఎం వంటి క్రియాశీల, ప్రగతిశీల పార్టీలతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది. బ్రహ్మాండంగా ముందుకెళతాం. న్యాయం, ధర్మం ఎప్పుడూ గెలిచి తీరుతుంది. అంతిమ విజయం మనదే.. మనదే.. మనదే.. జై భారత్.. జై జై భారత్..