ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటది. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం అవుతాం.
-ఇరిగేషన్పై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలో అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీద ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సచివాలయంలో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం, ప్రాణహిత తదితర నదుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుత విద్యుత్తు డిమాండ్ తదితర అంశాలపై చర్చించారు. చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తాగు, సాగునీటికి లోటు రాకుండా చూడాలని ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్తు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతి చుక నీటిని ఒడిసిపట్టి ప్రజలకు అందించాలని సూచించారు. ప్రాణహిత ప్రవాహం నుంచి నీటిని ఎప్పకప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ మిడ్మానేర్ను నింపాలని, అకడి నుంచి లోయర్మానేర్ డ్యాంకు సగం, పునరుజ్జీవ వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్లను తరలించాలని తెలిపారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యాపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇది పరీక్ష కాలం
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయశాఖ అధికారుల మీద ఉన్నది. ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది.
ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటది. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం అవుతాం’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఒక సంవత్సరం అనుభవం భవిష్యత్తు తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుందని చెప్పారు.. ఎకడి ఈఎన్సీలు అకడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నీరందించడమే లక్ష్యంగా ఏకాగ్రతతో పనిచేయాలని ఆదేశించారు. ఇందుకోసం అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు. తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని ఆదేశించారు. ఉదయసముద్రం, కోయిల్సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
రైతులు అధికారుల సూచనలు పాటించాలి
కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రజలు, రైతాంగం జాగ్రత్తలు వహించాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఇంజినీర్ల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. వర్షాభావ ప్రాంతాల్లో ఇప్పటికే విత్తిన పత్తి వంటి విత్తనాలు మొలకలెత్తలేదని, ఈ నేపథ్యంలో రైతులు తిరిగి విత్తుకొనేందుకు విత్తనాలు, ఎరువులు అందించగలిగేలా కంటిన్జెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. దీనిపై రోజూ మినిట్ టు మినిట్ రిపోర్టును సీఎం కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్తు, పంచాయతీరాజ్ శాఖల నుంచి వచ్చే రిపోర్టులను అనుసరించి సీఎం కార్యాలయం సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందని సీఎం వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల సుమన్, జాజుల సురేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వర్షాభావం ఉన్నా రైతులకు పుష్కలంగా నీరు
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది కలగకుండా వానకాలం సాగుకు నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సీఎం సమీక్ష అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇరిగేషన్శాఖ అధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎల్ఎండీ ఎగువ భాగం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 50 టీఎంసీలు అవసరమని, ఎస్సారెస్పీలో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు ఉన్నదని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవంలో భాగంగా కాళేశ్వరం జలాలు రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు ఎత్తిపోసి ఎస్సారెస్పీని నింపాలని సీఎం నిర్ణయించినట్టు తెలిపారు. నీటిని ఎత్తిపోసేందుకు మూడు పంపుహౌజ్లు సిద్ధం చేయాలని సీఈ సుధాకర్రెడ్డిని మంత్రి అదేశించారు. నిజాంసాగర్లో 5 సీఎంసీల నీటి నిల్వలుండగా, వానకాలం సాగు కోసం నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కామారెడ్డి సీఈ శ్రీనివాస్రెడ్డికి సూచించారు.
నిరంతరాయంగా ఎత్తిపోతలు
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్కోకు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు చేయాలని సాగునీటి శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్కు నాగార్జునసాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున, బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఒక టీఎంసీ నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, అకడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటర్లను నిరంతరాయంగా నడిపిస్తూనే ఉండాలి. సుందిళ్ల నుంచి అంతే నీటిని మిడ్మానేరుకు, అకడి నుంచి సగం నీటిని లోయర్ మానేరుకు, సగం నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యాపేటలోని చివరి ఆయకట్టు చిన సీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి’ అని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్తును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇరిగేషన్, విద్యుత్తుశాఖలు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
నేడు హైదరాబాద్కు అఖిలేశ్ యాదవ్ రాక
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సోమవారం తెలంగాణకు విచ్చేయనున్నారు. హైదరాబాద్కు చేరుకున్న అనంతరం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో సమావేశం కానున్నారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.