హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): నరేంద్రమోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను దుర్మార్గంగా కూలదోస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం జలవిహార్లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రైతులు, దినసరి కూలీలు, ఉద్యోగులు, జవాన్లు.. ఇలా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. మోదీ.. జనతా విరోధిగా మారారు. మోదీ తెచ్చిన గుణాత్మక మార్పు ఏది? ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన ప్రభుత్వాలను కూల్చుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 9 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను దుర్మార్గంగా కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాదులను హతమారుస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ దేశానికి మోదీ 15వ ప్రధాని. అంతకు ముందు 14మంది ప్రధానులు అయ్యారు. ప్రజలు సేవ చేసే అవకాశమిస్తే ప్రధాని అవుతారు. బాధ్యత తీరగానే వెళ్లిపోతారు. ఈ మార్పు సహజం. తప్పక సంభవిస్తుంది. అసంభవమేమీ కాదు. కానీ మోదీ తానే శాశ్వత ప్రధానిగా ఉంటానని కలలు కంటున్నారు. అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నారు.
చరిత్రలో ఎన్నడూ అంతర్జాతీయంగా మనదేశం పరువు మర్యాదలు ఈ రీతిలో దిగజారిపోలేదు. మోదీ ప్రధానిగా కాకుండా కార్పొరేట్ కంపెనీ సేల్స్మ్యాన్గా వ్యవహరిస్తున్నారు. భారత ప్రధాని దబాయించడం వల్లే భారత్కు చెందిన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చామని శ్రీలంక పార్లమెంట్ కమిటీ ఎదుట ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు బాహాటంగా ప్రకటించింది. ఫలితంగానే ఈ రోజు శ్రీలంక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇది దేశ ప్రతిష్ఠను పెంచడమా? ప్రతి విషయంపై గొంతుచించుకొనే కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులు ఈ విషయంలో ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు ఎందుకు? ప్రధానీ మీరెందుకు స్పందించరు? మీరు మౌనంగా ఉంటారేమోకానీ.. మేం కచ్చితంగా పోరాడతాం. ప్రధాని తన ప్రసంగానికి ముందు ‘భారత్మాతాకి జై’ అని నినదిస్తారు. అందులో ఏ మాత్రం నిజమున్నా, మీ రక్తంలో ఏ మాత్రం సత్యమున్నా.. నా ప్రశ్నకు బదులివ్వు. తెలంగాణ గడ్డపై నుంచి యావత్ దేశ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా. నిజాయితీపరులైతే శ్రీలంక అంశంపై బహిరంగ సభలో సమాధానమివ్వండి. లేదంటే మిమ్మల్ని పూర్తిగా దోషిగానే భావిస్తాం. మేకిన్ ఇండియా మరో బూటకం
ప్రధాని విధానాల వైఫల్యాల వల్ల దేశంలో ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను మూసివేశాయి. దేశం నుంచి తరలిపోతున్నాయి. మీ పాలనలో లక్షల మంది ప్రజలు విదేశాలకు తరలిపోతున్నారు. మేకిన్ ఇండియాతో సాధించింది శూన్యం. ఆ పథకమే పచ్చి అబద్ధం. మేకిన్ ఇండియాతో ఏం సాధించారు? మీకు పాలన తెలియకపోతే పక్కనే ఉన్న చైనాను చూసి తెలుసుకోండి. అక్కడ మాటలు తక్కువ చెప్తారు.. పనులు ఎక్కువ చేస్తారు. మన ప్రధాని మాటలు చెప్తారు.. చేతలు ఉండవు. దేశ ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామని చెప్పారు? ఇప్పుడెక్కడున్నాం? 3.1ట్రిలియన్ డాలర్ ఎకానమీ. ఇదే వేగంతో ముందుకు వెళ్తే మీరు చెప్తున్న 5 ట్రిలియన్ డాలర్లను ఎప్పటికీ చేరలేం. ఇవన్నీ నేను చెప్తున్న లెక్కలు కావు. కేంద్ర ప్రభుత్వానివే.