హైదరాబాద్, ఫిబ్రవరి 20 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అదీ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హోర్డింగ్స్ ఏ ర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జాతీయ స్థాయి మీడియాలో, ఉత్తరప్రదేశ్లో ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన వారణాసికి చెందిన కేసీఆర్ అభిమాని ‘మృత్యుంజయ మిశ్రా’ను నమస్తే తెలంగాణ పలుకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒక నాయకుడిగా, ఒక పైటర్గా నాకు కేసీఆర్ అంటే ఇష్టం. నేను హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ పడిన కష్టం చూశాను. దగ్గరి నుంచి ఆయన పోరాటాన్ని అర్థం చేసుకొన్నా. ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. ఆయన వల్లే తెలంగాణ వచ్చింది. ఆ సమయంలో చాలామంది స్నేహితులు తెలంగాణ, ఏపీ విభజన గురించి మాట్లాడేవారు. అలా నాకు ఉద్యమం వెనుక ఉన్న చరిత్ర తెలిసింది. దాని వెనుకున్న బాధ తెలిసింది. ఉద్యమ పోరాటాన్ని లీడ్ చేసిన విధానం, ప్రజలందరినీ ఒక్కతాటిపై నడిపించిన విధానం నచ్చింది. ఆ అభిమానంతోనే కేసీఆర్ గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మా ప్రాంతం నేత కాకున్నా ఆయన పుట్టినరోజున హోర్డింగ్స్ పెట్టించా’ అని వివరించారు. కేసీఆర్ గురించి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
రాహుల్ గాంధీని అవమానిస్తే స్పందించిన ఏకైక లీడర్
మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ తీసుకొంటున్న స్టాండ్ నచ్చింది. పార్లమెంట్లో ప్రధాని విభజన గురించి మాట్లాడాక కేసీఆర్ స్పందించిన తీరు నచ్చింది. రాహుల్ గాంధీని, ఆయన తండ్రి రాజీవ్గాంధీ గురించి అస్సాం ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడితే దాన్ని ఖండించిన ఏకైక నాయకుడు కేసీఆర్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కంటే ముందు కేసీఆర్ స్పందించారు.
వ్యక్తిత్వం, పనితీరులో కేసీఆర్ను మించినవాళ్లు లేరు
రాజకీయంగా కేసీఆర్ వ్యక్తిత్వం నచ్చుతుంది. తప్పుడు మాటలు ఉండవ్. ఒకరిని కించపరిచే మనిషి కాదు. చేసేదే చెప్తారు. చెప్పిందే చేస్తారు. వ్యక్తిత్వం, పనితీరులో కేసీఆర్ను మించిన నాయకుడు దేశంలో మరొకరు లేరు.
పీఎం ఫేస్ కేసీఆర్ అని ప్రజలే అంటున్నారు
నేను హోర్డింగ్స్ పెట్టించకముందు నుంచే వారణాసి ప్రజలు కూడా కేసీఆర్ సార్.. పీఎం కావాలని అనుకొంటున్నారు. నేను కూడా పీఎం ఫేస్కు కేసీఆర్ సరైన వ్యక్తి అని నమ్ముతున్నా. రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. టీఆర్ఎస్తో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఆలోచిస్తా.
నాయకుడు అంటే కేసీఆర్
తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ ఏం చేస్తున్నారు.. ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలుసుకొంటున్నా. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాలు ఓ మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన రైతు బిడ్డగా నన్ను ఆకట్టుకొన్నాయి. అందుకే నాకు నాయకుడు అంటే కేసీఆర్.
కేసీఆర్ పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలి
నేను ఓ బిజినెస్ మ్యాన్ను. కానీ కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుతమైన పథకాల గురించి మా ప్రజలకు తెలిసేలా చేయాలనుకొని, కేసీఆర్ పుట్టినరోజును వినియోగించుకొన్నా. రైతు బంధు, మిషన్ భగీరథ, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాలు ఇతర రాష్ర్టాల్లోనూ అమలు చేయాలి. అప్పుడే దేశం మరింత బాగుపడుతుంది.