వరదలపై 12 గంటలపాటు సీఎం సమీక్ష
వరద నీటిని ఎప్పటికప్పుడు వదలాలి
ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండాలి
అధికారులతో సమన్వయం చేసుకోవాలి
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై ఆరా
మంత్రి పువ్వాడ అక్కడే ఉండాలని ఆదేశం
ఎన్డీఆర్ఎఫ్, రెస్యూ బృందాలు, హెలికాప్టర్లు
సిద్ధం చేసుకోవాలి: ముఖ్యమంత్రి కేసీఆర్
సెక్రటేరియట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
హెల్ప్లైన్ నంబర్లు 7997959705, 7997950008
హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ): ‘మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలి. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి’ అని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరో రెండు, మూడురోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో మం త్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్నిశాఖల అధికారులు, సిబ్బంది తమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. భారీవర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సోమవారం ఉదయం నుంచి 12 గంటలపాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిని మంత్రులు, ఉన్నతాధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదురోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు.
అధికారులకు ప్రజలు సహకరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మరోసారి కోరారు. రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఫోన్లో మాట్లాడుతూ ఆరా తీశా రు. వరద ముప్పున్న జిల్లా అధికారులతో మాట్లాడి, పరిస్థితులను అంచనా వేశారు. గోదావరిలో వరద పరిస్థితిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటించినందున మంగళవారం కూడా అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని, భద్రాచలం పర్యటనలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ను సీఎం కేసీఆర్ ఫోన్లో ఆదేశించారు. రిజర్వాయర్ల బ్యాక్వాటర్తో సమీప గ్రామాలు ముంపునకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్రావుకు సీఎం కేసీఆర్ సూచించారు. గోదావరి పరివాహకంతోపాటు జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఎన్డీఆర్ఎఫ్, రెస్యూ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. రెండురోజులుగా వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన రక్షణ చర్యలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు.
సమన్వయంతో పనిచేయాలి
ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యం లో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు జిల్లా కేంద్రాలు, స్థానిక ప్రాంతాలను విడిచి ఎకడికీ వెళ్లొద్దని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని మంత్రులు జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్రెడ్డి, సుధీర్రెడ్డి, అంజయ్య యా దవ్, కృష్ణమోహన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నోముల భగత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్రావు, పీసీసీఎఫ్ డోబ్రియాల్, సీఎంవో కార్యదర్శులు స్మితాసబర్వాల్, భూపాల్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, సీఎంవోఎస్డీ ప్రియాంక వర్గీస్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్శాఖ ఈఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్నారు.
వర్షాలు, సహాయక చర్యలపై సోమవారం ప్రగతిభవన్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చిత్రంలో మంత్రి వేముల, ఎంపీ దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు
24 గంటల పాటు సేవలు
భారీ వర్షాల నేపథ్యంలో సెక్రటేరియట్లో ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటుచేసింది. వరద బాధితుల సహాయ చర్యల కోసం ప్రత్యేకంగా 7997959705, 7997950008 నంబర్లు ఏర్పాటుచేసింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ముగ్గురు అధికారులను ప్రత్యేకంగా నియమించింది. రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటలకు పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డీఎస్పీ శశాంక్రెడ్డి, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎస్సీ అభివృద్ధిశాఖ అడిషనల్ డైరెక్టర్ హనుమంత్నాయక్, డీఎస్పీ సత్యనారాయణరాజు విధులు నిర్వహించనున్నారు.
మంత్రి పువ్వాడ, అల్లోలకు సీఎం ఫోన్
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి ఫోన్ చేసి, ఆయా జిల్లాల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున సోమవారం భద్రాచలంలోనే బస చేయాలని మంత్రి పువ్వాడకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వరద పరిస్థితిపై ఇంద్రకరణ్రెడ్డిని అడిగి తెలుసుకొన్నారు.
లోతట్టు వంతెనల వద్ద పోలీస్ గస్తీ: డీజీపీ
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీస్శాఖ అప్రమత్తమైంది. వరద ఉధృతి కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా లోతట్టు ప్రాంతాల్లోని వంతెనలు, జలాశయాల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర పోలీస్ యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో పాల్గొంటున్నారు. వర్షాలు ఇంకా ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. వరదనీరు ప్రవహిస్తున్నప్పుడు కాజ్వే, కల్వర్టు, అండర్పాస్లు, చిన్న చిన్న వంతెనలపై వాహనాల మీద కానీ, నడిచి కానీ వెళ్లవద్దని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం 100కు డయల్ చేయాలని సూచించారు.