హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విద్యాశాఖ అధికారులు క్రమంగా విస్తరిస్తున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అక్టోబర్ 6న ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 స్కూళ్లల్లో ఈ పథకాన్ని మొదలుపెట్టిన అధికారులు.. ప్రస్తుతం 3,500లకుపైగా బడుల్లో అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల కోడ్, ప్రభుత్వ మార్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ పథకం అమలు మందగించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ‘అక్షయపాత్ర’ సంస్థ ద్వారా, గ్రామాల్లో మధ్యాహ్న భోజన కార్మికులతో బ్రేక్ఫాస్ట్ను తయారు చేయిస్తున్న అధికారులు.. అందుకు అవసరమైన వంటపాత్రల సేకరణకు టెండర్ల ప్రక్రియను చేపట్టారు.