హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం వేలం ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. టెండర్లలో బిడ్డర్లు వేసిన ధరలకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లడానికి ముందే పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో ఈ విషయమై చర్చించి బిడ్డర్లు దాఖలు చేసిన ధరలకు ఓకే చెప్పినట్టు సమాచారం. నిరుడు యాసంగి సీజన్కు సంబంధించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా మొత్తం 12 లాట్లకు 26 బిడ్లు దాఖలైనట్టు తెలిసింది. సాధారణ రకం ధాన్యానికి గరిష్ఠంగా రూ.1950, సన్నరకం ధాన్యానికి రూ. 2,100 వరకు ధరను కోట్ చేసినట్టు సమాచారం.