హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): డిగ్రీ కాలేజీల్లో సత్ఫలితాలిస్తున్న క్లస్టర్ విధానం ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ అమలవుతున్నది. ఈ ఏడాది నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 3 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మాసబ్ట్యాంక్,రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ -(సికింద్రాబాద్)తోపాటు మరికొన్ని కాలేజీలను అనుసంధానిస్తూ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్లస్టర్లలో 5 నుంచి 8 వరకు కాలేజీలు ఉంటాయి.
కొత్త కోర్సులు వచ్చినప్పుడుల్లా కొత్త ల్యాబ్ను కాలేజీల్లో ఏర్పాటు చేయడం కష్టతరమవుతున్నది. కొన్ని కోర్సులకు అధ్యాపకులు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే ఒక కాలేజీలోని ప్రయోగశాలలోని ఉపకరణాలను మరో కాలేజీ వినియోగించుకోవడం వంటి ఏర్పాట్లులో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో క్లస్టర్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు.