హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా, విభజన హామీల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో.. ఆయనకు భట్టి లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. రెండోసారి ప్రధాని అయ్యారు కానీ, ఇంతవరకు విభజన చట్టం అమలుకు కనీస హామీ ఇవ్వకపోవటం విచారకరమని విమర్శించారు. ఈ ఎనిమిదేండ్లలో అనేక పర్యాయాలు హైదరాబాద్ వచ్చి వెళ్లినా, ఏ ఒక సభలోనూ విభజన హామీలను ప్రస్తావించకపోవటం శోచనీయమని అన్నారు. పైగా, రాష్ట్ర ఏర్పాటునే తప్పుపడుతూ మాట్లాడటం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచటమేనని మండిపడ్డారు.
తల్లిని చంపి, పిల్లను బతికించారంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. విభజన చట్టంలో లేకపోయినా, తెలంగాణలోని 7 మండలాలు, 2 లక్షల ఎకరాల భూమిని ఆగమేఘాలపై ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేశారని, సీలేరులోని జలవిద్యుత్తు ప్రాజెక్టును ఏపీకి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ సక్రమంగానే జరిగిందని అన్నారు. ప్రస్తుత మోదీ సర్కార్లో మాజీ సైనికులకు భూములు లేవు, పెన్షన్ లేదు, ఉద్యోగం లేదని విమర్శించారు. అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.