హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వేడుకల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలిపారు. బీఆర్కే భవన్లో కమిటీ చైర్మన్ కేకే అధ్యక్షతన సమావేశం జరగ్గా.. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, భాషా సాంస్కృతిక విభాగం సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో పాటు పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 21న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 22న ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్, దీపికా రెడ్డి బృందంచే నృత్యం, తెలంగాణా జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయని వివరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున క్రాకర్ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. కార్యక్రమాలన్నీ దేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా ఉంటాయని వివరించారు.
ముగింపు వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 20 వేలకుపైగా హాజరవుతారని కేశవరావు తెలిపారు. ఈ సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.