హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కేంద్ర బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 724 గ్రామాల్లో జనవరి 31 వరకు కొనసాగే ఈ సర్వేలో మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, ఇతర మౌలిక సదుపాయాల పనులను తనిఖీ చేస్తున్నారు. ఈ గ్రామాల్లో కనీసం 7,240 ఇండ్లు, 350 కమ్యూనిటీ సంస్థలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో చెత్తను ఎన్ని రోజులకోసారి సేకరిస్తున్నారు? డ్రైనేజీల్లో పూడికను ఎన్ని రోజులకు తీస్తున్నారు? మరుగుదొడ్లను రోజూ ఉపయోగిస్తున్నారా లేదా? ఇంకా ఎంత మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నది? అనే అంశాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా గ్రామాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అందిస్తారు. పల్లెప్రగతి కార్యక్రమంతో తెలంగాణలోని గ్రామాలన్నీ పచ్చదనాన్ని పరుచుకొని పరిశుభ్రంగా మారడంతో ఈ సారి మన రాష్ట్రంలోని గ్రామాలకు ఎక్కువ అవార్డులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.