Mission Bhagiratha | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ‘పల్లె.. పట్టణమే కాదు కొండకోనల్లో.. అడవి గర్భంలోనూ శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ నల్లాల ద్వారా పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ’.. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులో.. లేక రాష్ట్ర అధికారులో చెప్పిన మాట కాదు.. సాక్షాత్తు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇచ్చిన కితాబు. రాష్ట్రంలోని గిరిజన గూడే లు, బంజారా తండాల్లో ఉన్న అన్ని ఆవాసాలకు నూటికి నూరు శాతం ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా (మిషన్ భగీరథ) అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని రాజ్యసభలో కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్సింగ్ పాటిల్ కొనియాడారు. తెలంగాణలో 6.87 లక్షల గిరిజన గృహాలు ఉంటే వాటన్నింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీరు అందుతున్నదని ఆయన చెప్పారు. దేశంలో ఒక్క తెలంగాణ, గుజరాత్ మినహా మరే రాష్ట్రం నూటికి నూరుశాతం గిరిజన ఆవాసాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించడంలేదని పేర్కొనటం విశేషం. దేశవ్యాప్తంగా 217.13 లక్షల గిరిజన గృహాలుంటే అందులో 120.04 లక్షల (55.45శాతం ఇండ్లకు మాత్రమే) ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా.. తెలంగాణలో 100 శాతం నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని గిరిజన ప్రాంతాల్లో తాగునీటి వసతి దారుణంగా ఉన్నదని రాజ్యసభ సభ్యురాలు కవిత పట్దీదర్కు కేంద్ర జల్శక్తి మంత్రి ప్రహ్లాద్సింగ్ పాటిల్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్న గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. రాజస్థాన్లో 17.64 లక్షల గిరిజన గృహాలు ఉండగా ఇందులో 3.34 లక్షల (18.93శాతం) ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దేశంలో అత్యధిక ఆదివాసీ, గిరిజన జనాభా ఉన్న రాష్ట్రంగా చెప్పుకొనే మధ్యప్రదేశ్లో 45.42 శాతం గిరిజన ఇండ్లకే నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. మరోవైపు అరుణాచల్ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరం.. ఈ ఏడు రాష్ర్టాలన్నీ గిరిజన రాష్ర్టాలే. ఈ రాష్ర్టాల్లో 23.01 లక్షల గిరిజన ఇండ్లు ఉండగా, 14 లక్షల (60.84శాతమే) ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆదివాసీ, మైదాన ప్రాంత గిరిజనుల సమగ్రాభివృద్ధి విషయంలో దేశంలో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకొన్నది. పౌష్ఠికాహార లోపాన్ని అధిగమించేందుకు చేపట్టిన ‘గిరిపోషణ’ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నది. అనేక రాష్ర్టాలు గిరిపోషణ ఫలాలపై అధ్యయనం చేస్తున్నాయి. అలాగే, 3,146 ఆదివాసీ, గిరిజన గ్రామ పంచాయతీల పరిధిలోని ఇండ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల అన్ని ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తూ తెలంగాణ సర్కారు రికార్డు సృష్టించడం విశేషం.