వరంగల్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు పరాకాష్టకు చేరింది. లోక్సభ సభ్యుడిగా అనర్హత వేటుపడిన రాహుల్గాంధీకి సంఘీభావంగా నిర్వహించే కార్యక్రమం సైతం ముఖ్యనేతల పంచాయితీలకు వేదికగా మారింది. జిల్లా కమిటీతో సంబంధం లేకుండా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు జంగా రాఘవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వరంగల్-హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ప్రకటించారు.
పీసీసీ సభ్యుడిగా ఉన్న తనపై చర్యలు తీసుకునే అధికారం నాయిని రాజేందర్రెడ్డికి లేదని, ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి స్థానికేతరుడు అని జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఈ ఇద్దరు నేతల మధ్య పంచాయితీ రెండేండ్లుగా కొనసాగుతున్నది. జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జనగామ డీసీసీకి తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ, హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో వీరి మధ్య విబేధాలు తలెత్తాయి.
దీనిపై రాజేందర్రెడ్డి గతంలోనే పలుసార్లు పీసీసీకి ఫిర్యాదు చేశారు. గతంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో రాహుల్గాంధీ నిర్వహించిన బహిరంగసభ సందర్భంగా కూడా నాయిని, జంగా వర్గీయులు ఫ్లెక్సీల విషయంలో కొట్టుకున్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలోనూ ఇద్దరు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు వ్యవహారం సస్పెన్షన్ల వరకు వెళ్లింది.