బయ్యారం, జనవరి 11: మహబూబాబాద్ జిల్లా బయ్యారం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. పార్టీ కార్యాలయం వేదికగా గురువారం రెండు వర్గాలు చేసిన రచ్చ వీధికెక్కింది. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు భరత్చంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు ముసలయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ క్రమం లో మరో వర్గానికి చెందిన నాయకులు సమావేశం వద్దకు వచ్చి తాము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమేనని, తమకెందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పార్టీకి సంబంధం లేని కొందరు వ్యక్తులు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. మరో వర్గం నాయకులు సైతం పార్టీ కోసం తాము కష్టపడ్డామని ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కుర్చీలు.. బల్లలు మీదకు ఎత్తి గంటపాటు కార్యాలయంలో రచ్చరచ్చ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాల నాయకులను సముదాయించారు.