హైదరాబాద్, నవంబర్7(నమస్తే తెలంగాణ) : పదేండ్ల అభివృద్ధికి, రెండేండ్ల అరాచకానికి మధ్య రెఫరెండంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో (Jubilee Hills By-Election) కాంగ్రెస్ పార్టీ (Congress) ఓటమి తప్పదని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) పరోక్షంగా ఒప్పుకున్నారు. పోలింగ్కు ముందే ఆయన ఓటమిని దాదాపు అంగీకరించారు. శుక్రవారం విలేకరుల మందు సీఎం తన బేలతనాన్ని బయటపెట్టారు. రేవంత్రెడ్డి రెండేండ్ల పాలనపై నాలుగు కోట్ల మంది అభిప్రాయాన్ని ప్రతిబింబించే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండగా, రెఫరెండం కాలం చెల్లినమాట అని, సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు మాట్లాడే మాటలాంటిదని రేవంత్రెడ్డి అన్నారు. ఈ ఒక్క మాటతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకున్నట్టేనని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల పరిపాలనకు రెఫరెండంగా భావిస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ “రెఫరెండం అనేది కాలం చెల్లిపోయిన, అర్థంపర్థం లేని మాట. ప్రతి ఎన్నిక తమ ప్రభుత్వ పనితనానికి పరీక్షే. గెలిచినా, ఓడినా ఆ ఫలితాలను విశ్లేషించుకొని పరిపాలన ఎలా చేయాలి? పేదలకు ఎలా సాయం చేయాలనేదే మా ఆలోచన” అని అన్నారు. సంక్రాంతి పండుగకు 5వ పేజీలోగంగిరెద్దులోళ్లు, అప్పుడప్పుడు వచ్చే పనికి మాలినోళ్లు ఇంట్లాంటివి మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఫుల్ టైం రాజకీయ నాయకుడినని అన్నారు. 20 ఏండ్ల నుంచి ప్రతి పక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం, ఇదే ప్రజాస్వామిక స్పూర్తి అని, దాని ప్రకారమే ముందుకు పోతున్నాని చెప్పారు.
వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలను వేడుకునేందుకు రేవంత్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కానీ ఓటమి భయంలో ఉన్న ఆయన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఆ ఒత్తిడిలో తానేం మాట్లాడాలనే విషయం మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాదాపు 2 గంటల పాటు విలేకరులతో మాట్లాడిన ఆయన ఉప ఎన్నికల ఫలితాలపై వస్తున్న సర్వేల మీద తానేమీ మాట్లాడనని చెప్పారు. అప్పుడప్పుడు జర సాయం చేయమని మీడియాను వేడుకున్నారు. తాను ఒకే ఒక్క ఓటు అడుగుతున్నానని అన్నారు. తమ గురించి కూడా రాయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా తానే అభ్యర్థిని అనుకుంటానని, పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు. డిపాజిట్ దక్కని హుజూరాబాద్లో, ఓడిపోయిన మునుగోడు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ తన ప్రయత్నం తాను చేసినట్టు చెప్పారు.