హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : గత సర్పంచులు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో తెలంగాణ పంచాయతీరాజ్శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఆ శాఖ డైరెక్టర్ దివ్యాదేవరాజన్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. 15వ ఆర్థిక సంఘం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు టైడ్ కాంపొనెంట్ నిధులు రూ.245.00 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 2024-25గాను బేసిక్ అన్ టైడ్, టైడ్ గ్రాంట్స్ కింద రూ.640.07 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
గత సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన నేపథ్యంలో 2023-24 సంవత్సరానికి విడుదలైన టైడ్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే గత సర్పంచులకు బిల్లులు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. 2023-24 టైడ్ కాంపొనెంట్ కింద విడుదలైన నిధులపై గత సర్పంచుల పెండింగ్ బిల్లులను రికార్డులు సరిచూసి చెల్లించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీపర్పస్ వరర్లు వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు జిల్లాల స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.