హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): పైగా భూముల వివాదంపై మధ్యంతర పిటిషన్ను పరిషరించకుండా ఆ భూముల దస్తావేజును రద్దుచేస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. మధ్యంతర పిటిషన్ను పరిష్కరించాకే తుది తీర్పు ఇవ్వాలని సివిల్ కోర్టును ఆదేశించింది. అందుకోసం ఈ వివాదాన్ని మళ్లీ సివిల్ కోర్టుకే పంపుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
పైగా భూముల్లో కొంత భాగాన్ని నిజాం పేరుతో 1966లో చేసిన విక్రయ దస్తావేజును రద్దు చేయాలని కోరుతూ బుగ్లీద్ జాహీ పైగా వారసురాలిగా హమీదున్నీసా బేగం వేసిన వ్యాజ్యాన్ని గతంలో 12వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కొట్టివేయడంతో ఆమె 11వ అదనపు చీఫ్ సివిల్ జడ్జిని ఆశ్రయించారు. దీంతో నిజాంకు హమీదున్నీసా బేగం చేసిన దస్తావేజుతోపాటు, సైరస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్కు నిజాం చేసిన దస్తావేజులను రద్దు చేస్తూ తీర్పు వెలువడింది. అనంతరం మధ్యంతర పిటిషన్పై నిర్ణయం తీసుకోకుండా తుది ఉత్తర్వులు ఇవ్వడంపై సైరస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రెండు అప్పీళ్లను దాఖలు చేయడంతో హైకోర్టు పై తీర్పును వెలువరించింది.