హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): వందల కోట్ల విలువైన భూమి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విజయం సాధించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను సమర్థించింది. రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం ఫతేనగర్ సర్వే నంబర్ 78, 79లోని సుమారు 11.5 ఎకరాల (46,538 చదరపు మీటర్లు) భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ధర్మాసనం తీర్పు వెలువరించింది. దానిపై పూర్తి అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని పేర్కొన్నది.
ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ ఏపీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ నుంచి స్వాధీనం చేసుకోవటం చెల్లదన్న సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తహసీల్దార్ దాఖలు చేసిన అప్పీళ్లను ఆమోదిస్తూ ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. 2008లో రద్దు చేసిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద 2010లో పంచనామా నిర్వహించి భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ఎలక్ట్రికల్ కంపెనీ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. అర్బన్ సీలింగ్ ల్యాండ్ (యూఎల్సీ) రద్దు అయ్యే నాటికి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోలేదని, యూఎల్సీ కింద ప్రభుత్వం పాత తేదీలతో నోటీసు ఇచ్చినట్టు సింగిల్ జడ్జి తీర్పులో పేరొనటానికి ప్రాతిపదిక ఏమిటో అర్థం కాలేదని తప్పుపట్టింది. భూమిని స్వాధీనం చేసుకోవటానికి పంచనామానే మార్గమని స్పష్టం చేసింది.