హైదరాబాద్ : న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం రాజ్యాంగబద్ధంగా నిబద్ధతతో పని చేస్తోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణ హైకోర్టు ప్రాంగణం నుంచి కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. న్యాయవ్యవస్థపై అవగాహన లేని వారికి కొన్ని సూచనలు చేస్తున్నానని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్తున్నారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారిపై అభాండాలు వేయడం సరికాదన్నారు. న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని చురకలంటించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం రాజ్యాంగబద్ధంగా నిబద్ధతతో పని చేస్తోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వ్యవస్థను చక్కబెట్టుకోలేని కొందరు కోర్టులను తప్పుబట్టడం సరికాదు. సమాజం, ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్థకు ముఖ్యమని చెప్పారు. పరిధులు దాటి మాట్లాడితే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిధులు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే అని స్పష్టం చేశారు. పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమని చెప్పారు. నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ అవసరం అని సీజేఐ అభిప్రాయపడ్డారు.
న్యాయవ్యవస్థలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలను హృదయపూర్వంగా తెలుపుతున్నాని చెప్పారు. తెలంగాణను సాధించిన ఉద్యమకారులకు, మేధావులకు, ప్రత్యేకించి న్యాయవాదులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కొత్త రాష్ట్రం ఎన్నో సందేహాలు, చర్చల మధ్య ఆవిర్భవించింది. అన్ని సందేహాలను పటాపంచల్ అయ్యాయి. రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధికి కూడా ముఖ్యమని సీఎం గ్రహించారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎన్వీ రమణ పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో తాను సంవత్సర కాలం నుంచి భారత ప్రధాన న్యయామూర్తిగా శాయశక్తుల కృషి చేస్తున్నానని తెలిపారు. న్యాయ వ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందని, దాని పట్ల విశ్వాసం కలిగించాలని, అవగాహన పెంచాలని, సమాజంలో ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. తెలియజేశానని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలకు న్యాయ వ్యవస్థ చేరువ ఉండాలనే ఉద్దేశంతో కొత్త కోర్టులను ప్రారంభించుకుంటున్నామని సీజేఐ పేర్కొన్నారు.
దేశ న్యాయవ్యవస్థలో తెలంగాణ ఒక కొత్త అధ్యాయానికి తెర తీసింది అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసించారు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణలో కూడా తొలి అడుగు వేయడం శుభ పరిణామం అన్నారు. న్యాయం ప్రజల వద్దకు చేరేలా ఒక అపూర్వ కార్యక్రమానికి సిద్ధమయ్యాను. ఇందుకు తెలుగువాడిగా గౌరవిస్తున్నాను. నేటితో 13 జ్యుడిషీయల్ యూనిట్లు ఏకంగా 35 జ్యుడిషీయల్ యూనిట్లుగా మారనున్నాయి. దేశంలో ఇంత భారీ స్థాయిలో జిల్లా న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరగడం ఇదే మొదటిసారి. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పరిపాలన సంస్కరణలను తీసుకొచ్చి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాని తర్వాత పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సంస్కరణ ఇవాళ న్యాయవ్యవస్థలో జరిగింది. ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు వినియోగించుకోవాలని ఎన్వీ రమణ సూచించారు.