హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ (2026-27) నుంచి కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎమ్మార్) నిబంధనల్లో కేంద్రం మార్పులు చేస్తున్నదని, అందుకు తగ్గట్టుగా మిల్లింగ్ విధానాన్ని మార్చుకోవాలని మిల్లర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. శుక్రవారం ఆయన సివిల్ సప్లయ్ భవన్లో మిల్లర్లతో సమావేశమయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ.. వచ్చే వానకాలం నుంచి సీఎమ్మార్లో నూక శాతాన్ని రా రైస్లో 25 నుంచి 10 శాతానికి, బాయిల్డ్ రైస్లో 16 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అనుగుణంగా మిల్లింగ్ మిషనరీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యమైన బియ్యం అందించేందుకు 20 వేల టన్నుల స్టీమ్డ్ రైస్ను సరఫరా చేయాలని ఆదేశించారు.