హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఇప్పటివరకు 30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 9 లక్షల టన్నుల సన్నరకం ధాన్యం, 21 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు మరింత ముమ్మరంగా సాగేందుకు 8,575 కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోలు కేంద్రాల వద్ద 18.6 కోట్ల గన్నీ బ్యాగ్లను అందుబాటులో ఉంచామని వివరించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు సుమారు 11,500 రవాణా వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు సందేహాలు, సమస్యలు ఉన్నా, ఏదైనా సహాయం కావాలన్నా టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1967ను సంప్రదించాలని సూచించారు.