హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులున్నది వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం సివిల్సైప్లె భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని తెలిపారు. ఇప్పటి వరకు 39.51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. మొత్తం రూ.8,690 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇప్పటికే రూ.7,208 కోట్లు రైతులకు చెల్లించామని వెల్లడించారు. పలు చోట్ల ధాన్యం నిబంధనలకు అనుగుణంగా లేకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తాలు, తేమ, మట్టిపెళ్లలు లేకుండా ధాన్యం తీసుకురావాలని రైతులను కోరుతున్నామని అన్నారు.
గతంతో పోల్చితే ధాన్యం కాంటాలో కోత భారీగా తగ్గిందని వివరించారు. డీఫాల్ట్ మిల్లర్ల నుంచి ఇప్పటికే రూ.660 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులకు నష్టం రాకుండా చూస్తామని అన్నారు. టెండర్లలో విక్రయించిన ధాన్యం ఖాళీ చేయాల్సిన గడువు ముగిసిన నేపథ్యంలో ఏం చేస్తారనే ప్రశ్నకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సన్న బియ్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు ఆయనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. సివిల్ సైప్లె ఉద్యోగులకు మిల్లర్లు ఒక్క పైసా అయినా ఇచ్చారేమో చెప్పాలని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా ముందుకెళ్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని, ఆ ఆరోపణల వెనుక ఏదో కుట్ర ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. తామంతా నిజాయతీగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.