Telangana Decade Celebrations | హైదరాబాద్ : ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్రం అందజేస్తున్న అవార్డులు, విదేశీ ప్రతినిధుల ప్రశంసలే ఇందుకు నిదర్శ నం. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో మున్సిపల్శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతు న్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందంజలో ఉన్నది. రాష్ట్రంలో 47% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. రాష్ట్ర భూభాగంలో పట్టణాలది 6 శాతమే అయినా, జీఎస్డీపీలో వాటా 65-70% ఉంటున్నది. ఐదేండ్లలో పట్టణ జనాభా ఎక్కువవుతుందన్న అంచనాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ అమలు చేస్తున్నది.
నూతన మున్సిపల్ చట్టం
కొత్త మున్సిపల్ చట్టం ద్వారా గ్రీన్ బడ్జెట్కు 10% నిధులు కేటాయించింది. వికేంద్రీకరణలో భాగంగా మున్సిపాలిటీల సంఖ్య 62 నుంచి 129కి పెరిగింది. నగర పాలక సంస్థలు 6 నుంచి 13కు చేరుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక 8 పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖకు కొత్తగా 4,500 పోస్టులను మంజూరు చేసింది. 3,712 పోస్టులను మున్సిపాలిటీలకు కేటాయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వార్డుకో ఆఫీసరు ఉండనున్నారు. రోజు చెత్త సేకరణకు 141 పట్టణాల్లో 2,165 కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. చెల్లింపుల విధానం సులభతరం చేయడంతో ఆస్తి పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. 2022-23లో రూ.825 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 141 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రతి 3 వార్డులకు ఒక నర్సరీ చొప్పున 1,012 నర్సరీలు, 2,818 ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు.
టీఎస్బీపాస్..
పట్టణాల్లో ఇండ్ల్ల నిర్మాణ అనుమతులను ఆన్లైన్లో పొందేలా టీఎస్బీపాస్ను 2020 నవంబర్ 16న ప్రారంభించారు. 75 గజాల లోపు స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి అక్కర్లేదు. 75 నుంచి 500 చదరపు మీటర్ల వరకు వెంటనే అనుమతులు ఇస్తారు. 500 చదరపు మీటర్లు లేదా 600 గజాలు, ఆపై నిర్మాణాలు, కమర్షియల్ బిల్డింగ్లకు సింగిల్విండో విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. టీయూఎఫ్ఐడీసీ ద్వారా 4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. 119 మున్సిపాలిటీల్లో రూ.3,508 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించారు. స్వరాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు వివిధ పథకాల ద్వారా రూ.16,780 కోట్లు మంజూరు చేసింది. అదనంగా 1,379 కోట్లను విడుదల చేసింది. ఇంటింటికీ నల్లాతో తాగునీటిని అందించాలనే లక్ష్యంతో అర్బన్ భగీరథను అమలుచేస్తున్నది. తెలంగాణ వచ్చాక 5,929 కోట్లతో 44.88లక్షల మందికి ప్రయోజనం చేకూరే విధంగా కనెక్షన్లు ఇచ్చారు.
అవార్డులు
అవార్డులను సాధించడంలో తెలంగాణ దేశంలో ముందునిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్లో అత్యధిక సంఖ్యలో 16 అవార్డులను దక్కించుకొని దేశంలో రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. ప్రధానమంత్రి స్వనిధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. వీధి వ్యాపారులకు వ్యాపారం చేసుకోవడానికి 618 స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని గుర్తించారు. 2,676 షెడ్స్ నిర్మాణా నికి నిర్ణయించగా, ఇప్పటికే 1,294 పూర్తికాగా 1,382 పనులు కొనసాగుతున్నాయి.
సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
ప్రజలకు అవసరమైన పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పూలు అన్ని ఒకే దగ్గర లభించాలనే ఉద్దేశంతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం రూ.500 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. 25 వేల కంటే తక్కువ జనాభా ఉన్న 57 పట్టణాల్లో ఒక్కోదాన్ని రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 81 పట్టణాల్లో ఒక్కొక్కటి రూ.4.50 కోట్లతో మార్కెట్లను నిర్మించనున్నారు. లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో లక్షకు ఒక మార్కెట్ చొప్పున గరిష్ఠంగా ఐదు నిర్మించాలని నిర్ణయించారు.
ఆధునిక ధోబీఘాట్లు
141 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆధునిక ధోబీఘాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.2 కోట్ల చొప్పున రూ.282 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని పట్టణ జనాభాలో ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక మరుగుదొడ్డి ఉండాలని, అందుకు అనుగుణంగా నిర్మాణం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో 4,970 ప్రజా మరుగుదొడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా 4,118 మరుగుదొడ్లను నిర్మించారు. రాష్ట్రంలో 139 ఎఫ్ఎస్టీపీలను రూ.428.06 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.
వైకుంఠధామాలు
వైకుంఠధామాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించారు. 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న 99 పట్టణాల్లో ఒక్కో వైకుంఠధామం అభివృద్ధికి రూ.కోటి, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న 29 పట్టణాల్లో రెండు చొప్పున నిర్మిస్తున్నారు. లక్ష నుంచి మూడు లక్షల జనాభా ఉన్న 9 పట్టణాల్లో ఒక దానికి కోటి, మరో దానికి రూ.2 కోట్లు కేటాయించారు. మూడు లక్షలకుపైగా జనాభా ఉన్న 4 పట్టణాల్లో రెండింటికి రూ.2 కోట్ల చొప్పున కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పట్టణాలకు వివిధ పథకాల ద్వారా 16 వేల 780 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి అదనంగా 1,379 కోట్లను విడుదల చేసింది. పట్టణ ప్రగతి ద్వారా ఇప్పటి వరకు రూ.4,537.79 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గత డిసెంబర్ నాటికి రూ.4,101 కోట్లను వెచ్చించారు.