హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి సీఐడీ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న ఉదయం 11.30 గంటలకు లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, కరీంనగర్ సీపీని దూషించినట్టు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. విచారణకు సహకరించాలని కౌశిక్రెడ్డిని అధికారులు కోరారు.
విచారణకు హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి 29న సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్లోని కేపీ చౌరస్తాలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో మద్దతు దారులతో కలిసి పాడి కౌశిక్రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దీంతో హుజురాబాద్ పోలీస్స్టేషన్లో 189(3), 126(2), 132, 299, 196, 351(2), ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయగా, ఈ మేరకు సీఐడీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.