కరీంనగర్ : కరీంనగర్ సీపీ ( Karimnagar CP ) పై తప్పుడు ఆరోపణలు చేశానని పేర్కొంటూ వేసిన సీఐడీ ( CID ) విచారణను బహిరంగంగా నిర్వహించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులను వారివారి కార్యాలయాల్లో కాకుండా బహిరంగంగానే విచారణ చేపట్టాలని కోరారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ సీపీ మత మార్పిడి చేస్తున్నాడని తాను అన్నట్లు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లేఖ రాశారని, తాను అలా అన్నానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. ఈ విషయంలో తనపై సీఐడీ విచారణపై ఆయన స్పందించారు. ఏ విషయంలోనైనా బహిరంగ విచారణకు సిద్ధమేనని ప్రకటించారు.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని మరచి అక్రమ కేసులపై దృష్టి పెడుతున్నారని గంగుల కమలాకర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి మీద పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. మత మార్పిడి చేస్తున్నాడని కౌశిక్ రెడ్డి ఎక్కడా అనలేదు. అయినా కూడా అతని మీద నిరాధారమైన ఆరోపణలు చేసి అక్రమ కేసు నమోదు చేశారని దుయ్యబట్టారు. డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికైనా ఎమ్మెల్యేలను వేధించే ప్రభుత్వానికి మద్దతు తెలపడం మానేయాలని డిమాండ్ చేశారు.