హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21 వ తేదీన ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకలలో ముఖ్యమంత్రి, పలువురు క్రైస్తవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారని చెప్పారు.
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి బ్రహ్మాడంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పేద క్రైస్తవులకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్ విందులను నిర్వహిస్తూ వస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను గౌరవిస్తుందని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పర్యవేక్షణలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. క్రిస్టియన్ సంక్షేమ భవన్ నిర్మాణం, చర్చిలు, గ్రేవ్ యార్డ్ ల అభివృద్ధి పై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీలు M.S.ప్రభాకర్, రాజేశ్వర్ రావు, ఎగ్గే మల్లేషం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, నాంపల్లి నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు.