హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): స్వదేశానికి తిరిగి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాస భారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. భారత్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, తొమ్మిదేండ్లలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో కవిత పాల్గొన్నారు. ప్రవాసీ తెలంగాణీయుల నివాసాల్లో బోనాలను అలంకరించుకొని స్థానిక దేవాలయానికి భారత జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత చేరుకున్నారు. బోనాలు సమర్పించిన తర్వాత జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో 3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకు చేరాయని ఆమె తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సంపదను పెంచి నిరుపేదలకు పంచుతున్నదని చెప్పారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎకువగా ఉన్నదని కవిత గుర్తు చేశారు. భారత సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను ఆస్ట్రేలియా దేశానికి విస్తరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బ్రిస్బేన్లో ఉన్న తెలుగువారు, భారతీయులకు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా రాజకీయాల్లో భారతీయులు రాణిస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకెళ్తున్నదని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని స్పష్టం చేశారు. దాదాపు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందనితెలిపారు. బోనాల ఉత్సవాల్లో భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు శ్రీకర్రెడ్డి అండెం, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి, బీటీఏ అధ్యక్షుడు కిశోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.