సంగారెడ్డి, ఫిబ్రవరి 21 : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల శంకుస్థాపనల నేపథ్యంలో సోమవారం నారాయణఖేడ్లో జరిగిన బహిరంగసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తాను గతంలో కంగ్టి మండలం సర్దార్ తండాలో ఎన్నిక ప్రచారానికి వెళ్లినప్పుడు అదే గ్రామానికి చెందిన చిమ్లిబాయి వ్యక్తంచేసిన ఆవేదనను హరీశ్రావు గుర్తుచేసుకొన్నారు. ఆ సమయంలో చిమ్లిబాయి సభలోనే ఉండటం విశేషం. ‘సార్ మా ఊరికి ఎవరు పిల్లనిస్తలేరు ..మా తండాకు కరెంట్ లేదు.. రోడ్డు లేదు.. నీళ్లు లేవు అంటూ ఆ రోజు తనతో అన్న మాటలను సీఎం కేసీఆర్కు మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇవాళ మీ దయతో (సీఎం కేసీఆర్) ఆ సర్దార్ తండాకు రోడ్డు వేసాం..త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చాం..తాగునీరు ఇచ్చాం. ఇప్పుడు ఆ తండాకు పిల్లను పిలిచి పిలిచి ఇస్తున్నారు. (ఇంతలోనే వేదిక మీదికి చిమ్లిభాయిని పిలిపించారు. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చోబెట్టుకోని ఆప్యాయంగా మాట్లాడారు). ఎర్ర బోగడ ఒక గ్రామం ఉంటుంది.. ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్లినప్పుడు 70 ఏండ్లు అయినా రోడ్డు కూడా లేదని ఆ రోజుల్లో చెప్పారు. ఇవ్వాళ అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించుకొన్నాం. ఇలా ఎన్నెన్నో విజయాలను నారాయణఖేడ్ ప్రాంతానికి సీఎం కేసీఆర్ దయతో తీర్చుకొన్నాం. నారాయణఖేడ్కు విద్య కోసం 8 రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చుకొన్నాం. 15 విద్యుత్తు సబ్స్టేషన్లు తెచ్చుకొన్నాం. మార్కెట్ యార్డుతోపాటు నారాయణఖేడ్ ప్రాంతంలో 54 తండాలను గ్రామ పంచాయతీలను చేసుకొన్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది. సీఎం కేసీఆర్ది’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులైన తరువాత కూడా చిమ్లిబాయిని గుర్తుపెట్టుకొని పిలిపించడం సంతోషంగా ఉన్నదని, చాలా కష్టం చేశారు కాబట్టే గుర్తుంచుకోగలిగారని ప్రశంసించారు.