కేసముద్రం, ఫిబ్రవరి 15: మిర్చి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో కాంటాలు నిర్వహించక పోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 12న 8 వేల బస్తాల మిర్చి విక్రయానికి రాగా, పరిమితికి మించి వచ్చిందని రెండు రోజులు మార్కెట్కు సెలవులు ప్రకటించారు. తిరిగి మార్కెట్ గురువారం ప్రారంభంగా కాగా, 6 వేల బస్తాల మిర్చి వచ్చింది. మళ్లీ పరిమితికి మించి విక్రయానికి వచ్చిందని కాంటాలను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో రైతులు 2 రోజులు పాటు మార్కెట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
మిర్చి కొనుగోళ్లను గత నెల 29న మార్కెట్లో ప్రారంభించారు. మార్కెట్ ప్రారంభించి 18 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం రోజులు మాత్రమే కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్కు రెండు, మూడు రోజులకోసారి సెలవులు ఇస్తుండటంతో రైతులు నేరుగా ట్రేడింగ్ కంపెనీలకు వెళ్లి మిర్చిని అమ్ముకుంటూ నష్టపోతున్నారు. మార్కెట్లో మిర్చి అమ్మితే ఎక్కువ మంది వ్యాపారులు ఉండటం వల్ల ధర కలిసివచ్చే అవకాశం ఉంటుంది. నేరుగా ట్రేడింగ్ కంపెనీలకు మిర్చి బస్తాలను తీసుకవెళ్లడంతో వ్యాపారులు తమ ఇష్టానుసారంగా తక్కువ ధరలకు కొంటున్నారు. చేసేదేమీ లేక రైతులు తప్పని పరిస్థితుల్లో మిర్చిని అమ్ముకొని నష్టపోతున్నారు. ట్రేడింగ్ కంపెనీల వద్ద అమ్ముకున్నట్లయితే తూకంలోనూ మోసం జరిగే అవకాశం లేకపోలేదు.
ఈ-నామ్ విధానంతో సరుకులను కొన్న వ్యాపారులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంటుంది. లేదా సరుకు అమ్మిన రోజు తేదీతో నగదును చెక్కు రూపంలో ఇవ్వాలి. అందుకు విరుద్ధంగా వ్యాపారులు నగదు చెల్లిస్తూ కోత విధిస్తున్నారు. మిర్చి కొనుగోలులో 3 శాతం, ఇతర పంటల కొనుగోళ్లలో 2 శాతం నగదు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. దీంతో రైతులు రోజుకు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. నగదు చెల్లింపుల్లో కోతలపై ప్రశ్నించిన రైతులకు 10 రోజుల వాయిదాతో తేదీ వేసి చెక్కులు ఇస్తున్నారు.
అధికారులు మార్కెట్కు తరచూ సెలవులు ప్రకటిస్తున్నారు. మార్కెట్ ప్రారంభమైన రోజు ఎక్కువ మిర్చి విక్రయానికి రావడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను పూర్తిగా తగ్గిస్తున్నారు. ఈ నెల 12న మార్కెట్కు 8 బస్తాల నాణ్యమైన మిర్చి, 4 బస్తాల తాలు మిర్చి తీసుకొచ్చా. పరిమితికి మించి విక్రయానికి వచ్చిందని వ్యాపారులు ఆ రోజు రాత్రి ధరలను నిర్ణయించి కాంటాలు మరో రోజు నిర్వహించారు. నాణ్యమైన మిర్చి క్వింటాల్కు 17 వేలు పలుకడంతో అమ్ముకోకుండా ఇంటికి తీసుకొచ్చా. 4 బస్తాల తాలు మిర్చిని క్వింటాల్కు రూ.11వేల చొప్పున అమ్ముకోగా రూ.18,270 రావాల్సి ఉండగా 3 శాతం కోత విధించారు.
– చెన్నబోయిన వీరన్న, రైతు, పెనుగొండ