అదొక ప్రత్యేకమైన కోర్టు. పిల్లలు ఆడుకునేందుకు వస్తువులున్నాయి. చిన్నారులు అడిగిన వెంటనే తెచ్చి ఇచ్చేందుకు కొన్ని తినుబండారాలు సిద్ధంగా ఉన్నాయి. తన ముందున్న టేబుల్పై నాలుగున్నరేండ్ల చిన్నారితో మాతృమూర్తిలా మాట్లాడుతున్నది న్యాయమూర్తి. ఆటబొమ్మలిచ్చి.. ఐస్క్రీములిచ్చి.. ఒక్కొక్కరి పేరు అడుగుతుంది. ఓ అంకుల్ పేరు పలుకగానే.. ఆ పాప కండ్లలో భయం.. ఏడుపు.. ‘వద్దూ వద్దూ’ అనే సంజ్ఞలు. అప్పటికే విషయం గ్రహించిన న్యాయమూర్తి.. రెండు ఆడ, మగ బొమ్మలను తీసుకొచ్చి.. ఏం జరిగిందో ఆ పాపతో ఆడుకుంటూనే చెప్పిస్తున్నది. ‘దిస్ బ్యాడ్ అంకుల్.. దిస్ గుడ్ గర్ల్.. టచ్డ్ హియర్, అండ్ హియర్. ది గర్ల్ సో పెయిన్ ఫుల్ అండ్ క్రయింగ్’ అంటూ విషయం మొత్తం చెప్పింది. అప్పటికే కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన ఆ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు న్యాయమూర్తి.. నిందితుడైన ఆ అంకుల్కు సహజ మరణం సిద్ధించేంత వరకూ కఠిన కారాగార శిక్ష విధించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ‘చైల్డ్ సెక్స్వల్ అబ్యూజ్’ కేసులను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో చైల్డ్ఫ్రెండ్లీ కోర్టులను ప్రవేశపెట్టింది. వీటితోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 పోక్సో కోర్టుల ద్వారా బాలలపై జరుగుతున్న అకృత్యాలపై విచారణలు వేగవంతం చేసింది న్యాయవ్యవస్థ. ఇటీవల హైదరాబాద్ సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలందర్నగర్ ఘటనలో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ చైల్డ్ఫ్రెండ్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సైతం కేవలం పది నెలల్లోపే ఇవ్వటం, బాధితురాలికి న్యాయపరంగా అందాల్సిన పరిహారం ఇప్పించటం ఈ చైల్డ్కోర్టుల ప్రత్యేకత.
వారంలో రెండు రోజులే వాదనలు
చైల్డ్ఫ్రెండ్లీ కోర్టుల్లో కేవలం వారంలో మంగళవారం, శుక్రవారం రెండ్రోజులు మాత్రమే వాదనలు జరుగుతాయి. అన్ని కోర్టుల్లాగే ఈ కోర్టుల్లో కూడా సిబ్బంది ఉంటారు. వీరంతా పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ కోర్టుల్లో న్యాయవాదులు బాధితులను ప్రత్యక్షంగా ప్రశ్నలు అడగటానికి వీలు లేదు. వారు అడగాలనుకున్న ప్రశ్నలను ఓ పేపర్పై రాసి న్యాయమూర్తికి ఇవ్వాల్సి ఉంటుంది. వాటినే న్యాయమూర్తి స్వయంగా అడుగుతారు. బాధితులకు నిందితులు కనిపించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. న్యాయమూర్తి, బాధితులు మాత్రమే ఓ ద్వారం నుంచి వస్తే.. నిందితులకు మరో ద్వారం ఉంటుంది. కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు బాధితులు నిందితులను చూసి ఆందోళనకు గురయ్యే అవకాశం ఉండటంతో కనిపించకుండా ప్రత్యేకంగా ఓ అద్దాన్ని ఏర్పాటు చేస్తారు. పోక్సో కేసుల్లో సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉంటే.. న్యాయమూర్తికి సైతం శిక్షను తగ్గించే అధికారం లేదు. సంబంధిత నేరానికి ఎంత శిక్ష వేయాలో.. అన్నేండ్లు శిక్ష పడాల్సిందే. ఈ ప్రత్యేక కోర్టు సిబ్బందికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి జీతభత్యాలుంటాయి.