హైదరాబాద్ : తన పేరుపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. ఫేక్ అకౌంట్లలో తన పేరును కించపరిచేలా విధంగా పోస్టులు పెడుతున్నారని, సదరు వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఫేక్ అకౌంట్లతో తాను చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, పబ్లిక్లో, మీడియా ఎదుట ఫేక్ అకౌంట్లతో తాను బద్నాం అవుతున్నానని వాపోయాడు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను ఫిర్యాదులో కోరాడు.
ఏపీ సీఎం జగన్తో తనకు పరిచయమే లేదన్న చీకోటి.. దీని వెనుక అసాంఘిక శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీ ప్రతిపక్ష నేతలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని, ఏపీ ప్రతిపక్షం అంటే ఎవరో ప్రపంచమంతా తెలుసునన్నారు. రాజకీయాలకు తనకు ముడిపెడుతున్నారని, నకిలీ ఖాతాల విషయంలో ఏపీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. విదేశీ క్యాసినోల వ్యవహారంలో వరుసగా మూడోరోజు చీకోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.