హైరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతి.. పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామీణ సడక్ యోజన, స్వయం సహాయక బృందాల పనితీరు తదితర అంశాలపై మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అన్ని గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు. పల్లె ప్రగతి, హరితహారంలాంటి విప్లవాత్మక కార్యక్రమాల వల్ల వంద శాతం గ్రామాలు ఓడీఎఫ్గా మారాయని చెప్పారు. పల్లెప్రగతి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగడంతోపాటు పంచాయతీల పాలన మెరుగుపడిందని పేర్కొన్నారు.
డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గడం, గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడటంతోపాటు గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు సమకూర్చామని, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో 1.11 కోట్ల మందికి 52.78 లక్షల జాబ్ కార్డులు జారీ చేసినట్టు తెలిపారు. వాటర్ షెడ్ కార్యక్రమం కింద 200 అమృత్ సరోవర్లను నిర్మించినట్టు చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేజ్-11 కింద 42 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 11,60,920 వ్యక్తిగత ఇంకుడుగుంతలను నిర్మించినట్టు వెల్లడించారు. సమీక్ష సమావేశంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.