హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయతీలు, 205 మున్సిపల్ వార్డుల్లో 12.29 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. 2,94,462 మందికి రీడింగ్ గ్లాసులను అందజేశారు. కొత్తగా 2,05,334 మందికి కళ్లద్దాలను తయారు చేసేందుకు ప్రతిపాదనలు అందినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సోమవారం ఆమె బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కంటి వెలుగుతోపాటు ఉపాధ్యాయుల బదిలీలు, మన ఊరు- మన బడి, ఆయిల్పాం సాగు, కొత్తగా ప్రారంభించుకున్న కలెక్టరేట్లలో కార్యాలయాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. కంటి వెలుగు శిబిరాల్లో మొత్తంగా రోజుకు సగటున 2 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 50 వేల కళ్లద్దాలను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.
పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు
ఉపాధ్యాయ బదిలీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని పేరొన్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగే ఈ బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయుల నుండి అందే ఫిర్యాదులు, దరఖాస్తులను పరిషరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
రేపటి నుంచి మన ఊరు-మన బడి ప్రారంభోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, బోధనేతర పరికరాల ఏర్పాటు కోసం చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో పనులు పూరె్తైన పాఠశాలలను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
57 వేల ఎకరాల్లో ఆయిల్పాం ప్లాంటేషన్
ఆయిల్పాం ప్లాంటేషన్లో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ను చేపట్టినట్టు వెల్లడించారు. మరో 60 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ జరుగుతున్నదని తెలిపారు.
వారంలోగా కొత్త కలెక్టరేట్లలోకి ప్రభుత్వ కార్యాలయాలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రారంభించుకున్న 17 నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్లకు వారంలోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని సీఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఉద్యానవన శాఖ ఇంచార్జి కమిషనర్ హనుమంతరావు, ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
నిమిషాల్లో కండ్లద్దాలు
నేను కొన్నిరోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నా. ప్రైవేటు దవాఖానకు వెళ్లే పరిస్థితి లేక అలాగే ఉండిపోయాను. మా ఇంటి దగ్గర్లో ప్రభుత్వం కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నదని తెలుసుకొని శిబిరానికి వచ్చాను. వైద్యనిపుణులు, సిబ్బంది నిమిషాల్లో వైద్య పరీక్షలు చేశారు. నాకు కళ్లద్దాలు అవసరమని గుర్తించి వెంటనే అందించారు. నిరుపేదల కోసం ఇంత మంచి కార్యక్రమం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కుంచా వెంకటమల్లమ్మ, పెనగడప, చుంచుపల్లి మండలం, భద్రాద్రి జిల్లా