హైదరాబాద్/శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే తెలంగాణ): ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, డబుల్ బెడ్రూం గృహ సముదాయాలు, వైకుంఠధామాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆదేశించారు. ఎంపిక చేసిన కొద్ది మంది మున్సిపల్ కమిషనర్లను మలేషియా, సింగపూర్కు పంపించి అక్కడి వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం చేయిస్తామని వెల్లడించారు. శనివారం గచ్చిబౌలిలోని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ)లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘ఇన్నోవేటివ్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్ సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ టు ది మున్సిపల్ కమిషనర్స్’ అనే వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అర్వింద్కుమార్ మాట్లాడుతూ, ఘన వ్యర్థాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించిందని గుర్తుచేశారు. 600 గజాలపైన నిర్మించే ఇండ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే కూల్రూఫ్ పాలసీని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని యూఎల్బీలలో ఫీకల్స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (ఎఫ్ఎస్టీపీ)లను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 68 నగరాల్లో ఇది పూర్తయిందని తెలిపారు. దేశంలో తెలంగాణతోపాటు ఒడిశా మాత్రమే ఈ తరహా ఎఫ్ఎస్టీపీలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి పెట్టామని ఈపీటీఆర్ఐ డీజీ వాణీప్రసాద్ తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీల్లో జీరో వేస్ట్ కాన్సెప్ట్ను అమలు చేయవచ్చని సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. వర్క్షాప్లో మున్సిపల్ కమిషనర్లతోపాటు పర్యావరణ ఇంజినీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.